వెస్టిండీస్తో తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్ట్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భారత్కు ఇది మూడో విజయం. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో 12 పాయింట్స్ చేరాయి.
డబ్ల్యూటీసీ 2027 పాయింట్స్ పట్టికలో భారత్ విజయాల శాతం 46.67 నుంచి 55.56 శాతానికి పెరిగింది. అయితే ర్యాంకింగ్స్లో మాత్రం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఒక్క విజయాన్ని నమోదు చేయని వెస్టిండీస్ చివరి స్థానంలో కొనసాగుతోంది.

అయితే వెస్టిండీస్పై విజయం సాధించిన తర్వాత కూడా భారత్ స్థానం మారకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ను పాయింట్స్ ద్వారా కాకుండా విజయాల శాతం ఆధారంగా లెక్కిస్తారు. ఈ సైకిల్ ముగిసే సమయానికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లకు మూడు గెలిచింది. దాంతో 100 విజయాల శాతంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సైకిల్లో రెండో స్థానంలో శ్రీలంక కొనసాగుతుంది. రెండు మ్యాచ్లు ఆడి ఒక విజయం సాధించి.. మరో మ్యాచ్ను డ్రా చేసుకున్న శ్రీలంక 66.67 విజయాల శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు భారత్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి మూడు విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో 55.56 విజయాల శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. తక్కువ మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల విజయాల శాతం భారత్ కంటే ఎక్కువగా ఉండటంతో టాప్-2లో కొనసాగుతున్నాయి.
వెస్టిండీస్తో ఆఖరి టెస్ట్ గెలిచినా టీమిండియా టాప్-2 చెరే అవకాశం లేదు. రెండో టెస్ట్లో విజయం సాధిస్తే టీమిండియా విజయాల శాతం 61.9 శాతానికి పెరుగుతుంది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ విధానం అసంబద్దంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. కొన్ని జట్లు తక్కువ మ్యాచ్లు ఆడితే.. ఇంగ్లండ్, భారత్ వంటి జట్లు ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నాయని, విజయాల శాతం ఆధారంగా ర్యాంకింగ్స్ ఇవ్వడం సరికాదనే అభిప్రాయం ఉంది.