ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్కు ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్కు దిగింది. అయితే ఈ మ్యాచ్లోనూ ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్బ్యాండ్స్ ధరించి బరిలోకి దిగారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ మృతికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్లని రిబ్బన్లు ధరించారు. 71 ఏళ్ల వేన్ లార్కిన్స్ జూన్ 28న మరణించారు.
ఆయన ఇంగ్లండ్ తరఫున 1979-91 మధ్య 13 టెస్ట్లు, 25 వన్డేలు ఆడాడు. టెస్ట్ల్లో 498 పరుగులు చేసిన లార్కిన్స్.. వన్డేల్లో 591 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. కౌంటీ క్రికెట్లో నార్థంప్టైన్షైర్ తరఫున 482 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 27142 పరుగులు చేశాడు.

భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలి టెస్ట్లో కూడా నల్లని రిబ్బన్లతో బరిలోకి దిగారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. రెండో టెస్ట్లోనూ నల్లని రిబ్బన్లు ధరించడంతో హైదరాబాద్ సమీపంలోని పాశమైలారం ఘటనకు సంతాపంగా బ్లాక్ రిబ్బన్స్ ధరించారని నెటిజన్లు పొరబడుతున్నారు. కానీ ఇరు జట్ల ఆటగాళ్లు మాజీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ మృతికి సంతాపంగా బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించారు. హైదరాబాద్ సమీపంలోని పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సోమవారం చోటు చేసుకున్న ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
రెండో టెస్ట్లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించగా.. ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్, పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్పై వేటు పడింది. వీరికి బదులు వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ బరిలోకి దిగారు. కరుణ్ నాయర్ మూడో స్థానంలో ఆడుతాడని చెప్పిన గిల్.. లోయరార్డర్ బ్యాటింగ్లో డెప్త్ కోసమే కుల్దీప్ యాదవ్ను తీసుకోలేదన్నాడు.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), క్రిస్ వోక్స్, జోష్ టోంగ్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్.
భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ.