ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా మ్యాచ్కు తెరలేవనుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత రాపర్ హనుమన్కైండ్ తన పాటతో అభిమానులను అలరించాడు.
అయితే అతను ప్రదర్శన ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తటస్థ వేదికగా జరిగే మ్యాచ్కు భారత ర్యాపర్ను ఎంపిక చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేరళకు చెందిన హనుమన్కైండ్ 2024లో విడుదలైన "బిగ్ డాగ్స్" పాటతో అంతర్జాతీయ హిప్-హాప్లో గుర్తింపు పొందాడు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు తటస్థ వేదికల్లో ఆడాలని ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రీలంక వేదికగా ఈ బిగ్ మ్యాచ్ జరుగుతుంది. అలాంటిది ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించే కల్చరల్ ఈవెంట్లో భారతీయ కళాకారుడిని నియమించడం పక్షపాతమేనని విమర్శుకులు అంటున్నారు.
ఐసీసీ ఈ మ్యాచ్ ద్వారా భారీ ప్రసార ఆదాయాన్ని పొందుతుంది. అందుకే మ్యాచ్ ప్రారంభానికి ముందు కల్చరల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో భారతీయ మార్కెట్కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే భారత కళాకారుడికి అవకాశం కల్పించారని పాక్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఐసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ కల్చరల్ ఈవెంట్లో హనుమన్కైండ్ పాడే పాటపై కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. ఎందుకంటే పాకిస్థాన్లో నిషేధించిన "ధురందర్" చిత్రంలోని టైటిల్ ట్రాక్ను హనుమన్కైండ్ ఆలపించనున్నాడు. అందుకు సంబంధించిన రిహార్సల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కందహార్ హైజాక్, 26/11 దాడులు వంటి సున్నితమైన సంఘటనలను కథాంశంగా ధురందర్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అలాంటి సినిమా పాటను అంతర్జాతీయ మ్యాచ్కు ముందు ఎలా అనుమతిస్తారని పాకిస్థాన్ నెటిజన్లు ఐసీసీని నిలదీస్తున్నారు.
అయితే హనుమన్కైండ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ర్యాపర్ అని, అందుకే అతన్ని ఐసీసీ ఎంపిక చేసిందని భారత నెటిజన్లు విమర్శలను తిప్పికొడుతున్నారు. మరోవైపు ఈ టోర్నీలో ఏ మ్యాచ్కు ఇవ్వని ప్రాధాన్యతను ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్కు ఇస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆదాయం పరంగా భారత్-పాక్ మ్యాచ్ ఐసీసీ బంగారు బాతులాంటిది. ఈ ఒక్క మ్యాచ్తోనే ఐసీసీకి కోట్ల రూపాయాల ఆదాయం రానుంది. దాంతోనే బాయ్కట్ నిర్ణయాన్ని పాకిస్థాన్ మార్చుకునేలా చర్చలు జరిపింది.
భారత్, పాక్ మ్యాచ్కు ముందు కల్చరల్ ప్రొగ్రామ్ ఏర్పాటు చేసింది. అయితే ధురంధర్ టైటిల్ సాంగ్తో పాకిస్థాన్కు భారత్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిందని మన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భారత్, పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందే ధురంధర్ టైటిల్ సాంగ్ సెగ పుట్టించిందని కామెంట్ చేస్తున్నారు.