
ముంబై: అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ 2021 సంబంధించిన టీమిండియా జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆవిష్కరించింది. ఈ నయా జెర్సీలు ధరించిన టీమిండియా ఆటగాళ్ల ఫొటోలను బుధవారం ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బిలియన్ చీర్స్ జెర్సీని ఆవిష్కరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను స్పూర్తిగా తీసుకొని ఈ జెర్సీని రూపొందించామని ఈ ట్వీట్కు క్యాప్షన్గా పేర్కొంది.
మాములుగా భారత ఆటగాళ్లు ధరించే జెర్సీల కంటే ఈసారి కలర్ డోస్ను పెంచేశారు. మెన్ఇన్ బ్లూ కాస్త.. థిక్ బ్లూగా మారిపోయింది. నేవీ బ్లూ కలర్లో ఉన్న ఈ జెర్సీపై ముందుభాగంలో రాయల్ బ్లూ కలర్ షేడ్స్ కనిపిస్తున్నాయి. దానిపై టీమిండియా కిట్ స్పాన్సర్స్ అయిన ఎమ్పీఎల్ స్పోర్ట్స్, బైజూస్ సంస్థల పేర్లు తెల్లని రంగులో కనిపిస్తున్నాయి. ఇక ఆరెంజ్ కలర్లో ఇండియా పేరు కనబడుతుంది. జెర్సీ ఎడమ భాగంలో బీసీసీఐ లోగోతో పాటు కొత్తగా మూడు చుక్కలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ మూడు చుక్కలు ఏంటనే సందేహం అభిమానులందరికి కలుగుతుంది. అయితే ఆ మూడుచుక్కులు టీమిండియా గెలిచిన మూడు ప్రపంచకప్లకు సంకేతంగా తెలుస్తోంది. దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి 1983 ప్రపంచకప్ గెలుచుకున్న భారత్.. 24 ఏళ్ల తర్వా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో అరంగేట్ర టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. మరో నాలుగేళ్ల వ్యవధిలోనే మహీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్ గెలుపొందింది. ఈ మూడు విజయాలకు చిహ్నంగానే ఈ త్రీ స్టార్స్ను జెర్సీపై ఉంచారు.
అక్టోబర్ 17న ఓమన్ వేదికగా క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
పాకిస్థాన్తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 31న న్యూజిలాండ్తో, నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్తో భారత్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లీసేన తలపడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.