ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకుంది. రసవత్తర ఫైనల్లో తడబడ్డా నిలబడ్డ టీమిండియా.. న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా మూడో ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. కోట్లాది అభిమానులను మురిపించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ స్వీకరించే ముందు భారత ఆటగాళ్లందరికి వైట్ జాకెట్స్ ప్రధానం చేశారు. ఆ వైట్ జాకెట్స్ ధరించిన తర్వాతే భారత ఆటగాళ్లు టైటిల్ స్వీకరించారు. అయితే ఈ వైట్ జాకెట్స్ ఎందుకు ప్రధానం చేశారు? వాటిని ఆటగాళ్లంతా ఎందుకు ధరించారనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. వైట్ జాకెట్ వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం.
1998 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్నప్పటికీ.. ఈ వైట్ జాకెట్ ధరించే సంప్రదాయాన్ని ఐసీసీ 2009లో ప్రవేశపెట్టింది. ఆ ఎడిషన్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా తెల్లటి జాకెట్స్ ధరించి టైటిల్ అందుకున్నారు. ఆ తర్వాత ఇది ఒక సంప్రదాయంగా మారింది. ఈ వైట్ జాకెట్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఐసీసీ తమ ప్రకటనలో తెలియజేసింది.

వైట్ జాకెట్స్ ఎందుకంటే..?
'తెల్లటి జాకెట్ విజేతలకు అందించే గౌరవ చిహ్నం. ఇది ఆటగాళ్ల ప్రతిభతో పాటు నిరంత కృషిని ప్రతిబింబిస్తూ భవిష్యత్తు తరాలకు స్పూర్తిగా నిలుస్తోంది. వైట్ జాకెట్ గెలవడం అనేది విజయం కోసం అన్ని విధాల పోరాడాలనే విషయాన్ని సూచిస్తుంది. ఈ జాకెట్ తెల్లటి రంగులో గోల్డెన్ బ్రైడింగ్తో రూపొందిచారు. ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన లోగోకు గోల్డెన్ కలర్తో పాటు ఫ్యాబ్రిక్ రంగుతో ఎంబ్రాయిడరీ చేశారు. దాంతో ఈ లోగో అందర్నీ ఆకర్షిస్తోంది.'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ జాకెట్ను ముంబైకి చెందిన స్టైలిస్ట్ బబిత రూపొందించారు. అత్యంత ఖరీదైన ఇటాలియన్ నూలుతో ఈ జాకెట్ను డిజైన్ చేశారు.
ఈ వైట్ జాకెట్స్ను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రధానం చేయగా.. వరుణ్ చక్రవర్తీ ముందుగా ఈ వైట్ జాకెట్ను స్వీకరించాడు. రోజర్ బిన్నీ స్వయంగా ఆటగాళ్లందరికీ ఈ జాకెట్స్ను తొడిగారు. ఈ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో), శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 34 నాటౌట్) రాణించారు.