మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ ధరించి బరిలోకి దిగారు. 17 ఏళ్ల ఆసీస్ యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ అకాల మృతికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించారు.
మెల్బోర్న్లో ప్రాక్టీస్ నెట్ సెషన్లో బంతి మెడ భాగంలో బలంగా తగలడంతో ఆస్టిన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణ ఉదంతాన్ని గుర్తు చేసిన ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
17 ఏళ్ల బెన్ ఆస్టిన్ మంగళవారం మధ్యాహ్నం ఫర్న్ట్రీ గల్లీలోని వ్యాలవీ ట్యూ రిజర్వ్లో శిక్షణ తీసుకుంటుండగా ఈ విషాదకర సంఘటన జరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా వివరాల ప్రకారం.. ఈ యువకుడు నెట్స్లో హెల్మెట్ ధరించి బౌలింగ్ మెషీన్ ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి అతని మెడ భాగంలో బలంగా తాకింది.

దాంతో ఆస్టిన్ క్రీజులోనే కుప్పకూలిపోగా.. అతన్ని హుటాహుటిన మోనాష్ మెడికల్ సెంటర్కు తరలించారు. తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ బుధవారం ఆస్టిన్ తుదిశ్వాస విడిచాడు. 2014లో ఫిలిప్ హ్యూజ్ కూడా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ మ్యాచ్లో ఇలానే గాయపడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. యువ క్రికెటర్ అకాల మృతికి సంతాపం తెలిపిన భారత్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు.. జాతీయ గీతాలపన సమయంలో బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించి మౌనం కూడా పాటించారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో గాయపడి జట్టుకు దూరమైన ప్రతికా రావల్ స్థానంలో షెఫాలీ వర్మ తుది జట్టులోకి రాగా.. రిచా ఘోష్, క్రాంతి గౌడ్ రీఎంట్రీ ఇచ్చారు. హర్లీన్ డియోల్పై వేటు పడగా.. ఉమా ఉద్వాసనకు గురైంది.
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. కెప్టెన్ అలీస్సా హీలీ(5) త్వరగానే విఫలమైనా.. మరో ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ సెంచరీతో చెలరేగింది. దాంతో 27 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది.