హైదరాబాద్: ఆసియాకప్ 2023 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో 14 రోజుల్లో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఆసియాకప్ 2022 టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది.
టీ20 ఫార్మాట్లో సాగిన ఈ టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించింది. ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది. అయితే గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ మెగా టోర్నీ.. ఈ సారి వన్డే ఫార్మాట్లో ఎందుకు జరుగుతుందనేది? అభిమానులకు సందేహంగా మారింది. 1984లో మొదలైన ఆసియాకప్.. సక్సెస్ఫుల్గా 17 ఎడిషన్స్ పూర్తి చేసుకుంది.

1984 నుంచి 2014 వరకు వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్ను 2016లో తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఆ తర్వాత 2018లో వన్డే ఫార్మాట్లో జరిపారు. కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టోర్నీ.. కరోనా వైరస్ కారణంగా 2022కు వాయిదపడగా.. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో నిర్వహించారు.
మళ్లీ ఇప్పుడు వన్డే ఫార్మాట్లో నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇలా ప్రతీ సీజన్కు ఫార్మాట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఐసీసీ మెగా టోర్నీల నేపథ్యంలోనే ఆసియాకప్ను వన్డే, టీ20 ఫార్మాట్లలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో.. ఆసియాకప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.
అయితే ఈ ఫార్మాట్ల మార్పుపై 2015లోనే నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ మెగా టోర్నీలకు అనుగుణంగా ఆసియా కప్ నిర్వహించాలని అప్పటి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిర్ణయించింది. 2016లో భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగడంతో.. ఆ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ వేదికగా ఆసియాకప్ను తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు.
ఈ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా విజేతగా నిలిచింది. 2019 వన్డే ప్రపంచకప్ ముందు జరిగిన 2018 ఆసియాకప్ను మళ్లీ వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టైటిల్ గెలిచింది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ 2022 నేపథ్యంలో ఆసియాకప్ 2022ని మళ్లీ టీ20 ఫార్మాట్లో జరిపారు.
ఇప్పుడు వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఐసీసీ మెగా టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్ ఫార్మాట్ను డిసైడ్ చేయనున్నారు.