న్యూఢిల్లీ: 13 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యుత్తమ సారథులు.. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలని స్టార్ స్పోర్ట్స్ నిపుణుల జ్యూరీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరిలో తమ బెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని కూడా భారత మాజీ క్రికెటర్లు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే గౌతం గంభీర్.. తన దృష్టిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మనే ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు.
అతను సాధించిన టైటిళ్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, జట్టును ఎన్నిసార్లు విజేతగా నిలిపామన్నదే కెప్టెన్సీ సత్తా తెలియజేస్తుందన్నాడు. క్రికెట్ నుంచి తప్పుకునేలోపు అతడు మరో మూడు ట్రోఫీలైనా సులువుగా తన ఖాతాలో వేసుకుంటాడని ఈ మాజీ ఓపెనర్ జోస్యం చెప్పాడు.
ఇక గంభీర్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్దంగా భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీనే ఐపీఎల్లో అత్యత్తుమ కెప్టెన్ అని స్పష్టం చేశాడు. రోహిత్ నాలుగు టైటిళ్లు గెలిచినా.. తన దృష్టిలో మాత్రం ధోనీనే బెస్ట్ కెప్టెన్ అని కొనియాడాడు. 2014, 2015 సీజన్లలో నెహ్రా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాడు.
'నా దృష్టిలో ధోనీనే అత్యుత్తమ కెప్టెన్. అతని కెప్టెన్సీలో నేను చాలా మ్యాచ్లు ఆడాను. అది జాతీయ జట్టు అయినా.. ఐపీఎల్ అయినా.. నాకు ధోనీనే ఉత్తమమైన సారథి. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో నేను ఆడలేదు.. అందుకే నా దృష్టిలో ధోనీ బెస్ట్ కెప్టెన్'అని నెహ్రా చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నడిపిస్తున్న ధోనీ.. 2010, 2011, 2018 సీజన్లలో టైటిల్ అందించాడు. ప్రతీ సీజన్లోనూ జట్టును ప్లేఆఫ్స్ చేర్చాడు. ఇక రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు 2013, 2015, 2017, 2019లో విజేతగా నిలిచి అత్యధికంగా నాలుగు టైటిళ్లను సొంతం చేసుకుంది.
ఇక్కడ ధోని బెస్ట్ కెప్టెన్ అనేంతవరకూ బాగానే ఉన్నా.. రోహిత్ ఉత్తమ కెప్టెన్ కాదనడానికి నెహ్రా చెప్పిన కారణం మరీ సిల్లీగా ఉంది. రోహిత్ సారథ్యంలో ఆడకపోవడంతోనే అతను తన దృష్టిలో బెస్ట్ కెప్టెన్ కాదని ఈ భారత మాజీ పేసర్ పేర్కొనడం చాలా విడ్డూరంగా ఉందని రోహిత్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
మేం దేశం కోసం ఆడితే.. భారత క్రికెటర్లు వ్యక్తిగత రికార్డుల కోసం ఆడారు: పాక్ మాజీ క్రికెటర్