సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025 మూడో రోజు ఆట ప్రారంభమైంది. దాదాపుగా ఈ రోజు మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఇప్పటికే 218 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న ఆసీస్ విజయం దిశగా సాగుతోంది. 74 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ(50 బంతుల్లో 5 ఫోర్లతో 43) టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(3/44), లుంగి ఎంగిడి(3/35) మూడేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, వియాన్ మల్డర్ తలో వికెట్ తీసారు.
అంతకుముందు 43/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ బెడింగ్హమ్(111 బంతుల్లో 6 ఫోర్లతో 45), టెంబా బవుమా(84 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(6/28) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. కమిన్స్కు తోడుగా మిచెల్ స్టార్క్(2/41) రెండు వికెట్లు తీయగా..జోష్ హజెల్ వుడ్(1/27)కు ఓ వికెట్ దక్కింది. తొలి రోజు తరహాలోనే రెండో రోజు కూడా బౌలర్ల హవానే నడిచింది. మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. మూడో రోజు కూడా బౌలర్లు సత్తా చాటితే మ్యాచ్ ఫలితం తేలనుంది.

మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో మైదానంలోకి దిగారు. ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలోని మృతులకు నివాళులర్పించారు. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే మేఘానీ నగర్లోని జీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటనకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు తమ సంతాపం ప్రకటించారు.