న్యూఢిల్లీ: లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నో 56 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే ఆ జట్టు ఓటమిపాలైందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
228 పరుగుల భారీ లక్ష్యచేధనలో అదిరిపోయే ఆరంభం(88/1) వచ్చిన తర్వాత ఫామ్లో లేని దీపక్ హుడా(11)ను బ్యాటింగ్ పంపించడం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని తెలిపాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై తడబడిన దీపక్ హుడా.. లక్నో విజయవకాశాలను దెబ్బతీసాడని విమర్శించాడు. అతనికి బదులు సూపర్ ఫామ్లో ఉన్న నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినీస్, ఆయుష్ బదోనిల్లో ఒకరిని బ్యాటింగ్కు పంపించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు.

ఈ మ్యాచ్ అనంతరం క్రిక్బజ్ షో లక్నో బ్యాటింగ్ తీరును సెహ్వాగ్ విశ్లేషించాడు.'చేజింగ్లో ఒకదశలో లక్నో సూపర్ జెయింట్స్ 10 ఓవర్లకు 102/1తో పటిష్టంగా కనిపించింది. ఇంత అద్భుతమైన ఆరంభం తర్వాత ఆ జట్టు అస్సలు ఓడిపోకూడదు. ఒకవేళ ఓడినా చాలా తక్కువ తేడాతో పరాజయం పాలవ్వాల్సింది. తొలి వికెట్ కోల్పోయిన తర్వాత సూపర్ ఫామ్లో ఉన్న బ్యాటర్ వస్తాడని భావించా.
నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినీస్, అయుష్ బదోనిల్లో ఎవరో ఒకరు బ్యాటింగ్ చేస్తారని భావించా. ఎవరూ లేకుంటే భారీ షాట్లు ఆడగలిగే కెప్టెన్ కృనాల్ పాండ్యా అయినా వస్తాడేమోనని అంచనా వేసా. కానీ దీపక్ హుడా బ్యాటింగ్కు వచ్చాడు. ఇక్కడే లక్నో సూపర్ జెయింట్స్ ఘోర తప్పిదం చేసింది. ఈ నిర్ణయమే లక్నో ఓటమికి బాటలు వేసింది.
ఇది అత్యంత తెలివి తక్కువ నిర్ణయం. ఒకవేళ పూరన్ గనుక వచ్చి ఉంటే గత మ్యాచ్ల్లో అతని ప్రదర్శనను బట్టి చూస్తే ఓ 20 బంతుల్లో 50పరుగులు చేసేవాడు. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. అయూష్ బదోని చివర్లో బ్యాటింగ్కు వచ్చి 11 బంతుల్లో 22 పరుగులు చేశాడు.
ఒకవేళ అతనే ముందు వచ్చి ఉంటే మరింత ధాటిగా ఆడి రన్రేట్ పెంచేవాడు. కానీ దీపక్ హుడాను మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపి ఘోర తప్పిదం చేశారు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? కెప్టెన్ లేకా టీమ్మేనేజ్మెంట్దా? 'అని పరోక్షంగా గంభీర్కు సెహ్వాగ్ చురకలంటించాడు.