బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో ఓటమి ఎదురైంది. కోల్కతా నైట్రైడర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఆర్సీబీ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడం రెండోసారి. కేకేఆర్ గెలిచిన మూడు మ్యాచ్ల్లో రెండు సార్లు ఆర్సీబీపైనే గెలుపొందడం విశేషం. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ మూడు తప్పిదాలు కొంపముంచాయి.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం.. : ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్పైనే ఆధారపడి ఉండగా.. చేజింగ్ తీసుకోవడం ఘోర తప్పిదం. ముందుగా బ్యాటింగ్ చేసి సాధారణ స్కోర్ పెట్టినా కేకేఆర్ ఒత్తిడికి చిత్తయ్యేది. పైగా ఆ జట్టు వరుస ఓటములతో పూర్తిగా చతికిలపడింది. అయినా కోహ్లీ తమ బౌలర్లపై నమ్మకంతో చేజింగ్కు మొగ్గు చూపి మూల్యం చెల్లించుకున్నాడు.

చెత్త ఫీల్డింగ్.. : కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆర్సీబీ ఫీల్డర్లు చేసిన తప్పిదం జట్టు ఓటమిని శాసించింది. 4, 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా ఇచ్చిన సునాయస క్యాచ్లను సిరాజ్, హర్షల్ పటేల్ నేలపాలు చేశారు. ఈ అవకాశంతో చెలరేగిన అతను (21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 48)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
దాంతో చివర్లో వచ్చిన రింకూ సింగ్, డేవిడ్ వైస్ కూడా భారీ షాట్లు ఆడి జట్టు స్కోర్కు అదనంగా 20-25 పరుగులు అందించారు. ఆర్సీబీ ఈ పరుగుల తేడాతోనే ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.

పేలవ బ్యాటింగ్.. : భారీ లక్ష్యచేధనలో ఏ జట్టుకైనా శుభారంభం ముఖ్యం. కానీ ఆర్సీబీ కీలక బ్యాటర్లు అయిన ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్వెల్ ఇద్దరూ పవర్ ప్లేలోనే ఔటవ్వడం ఆ జట్టు ఓటమికి కారణమైంది. మహిపాల్ లోమ్రోర్తో కోహ్లీ పోరాడినా.. కేకేఆర్ స్పిన్నర్లు అవకాశం ఇవ్వలేదు.
భారీ షాట్లు ఆడాలనే ఆతృతలో బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. కానీ ఇన్నింగ్స్ను చివరి వరకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయలేదు. విరాట్ కోహ్లీ ఔటవ్వడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. కోహ్లీ ఉండి ఉంటే వీలైనంత వరకు ఇన్నింగ్స్ను చివరి వరకు తీసుకెళ్లేవాడు. అప్పుడు మ్యాచ్ గెలవడానికి ఆస్కారం ఉండేది.