ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనతో అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. మిగతా 8 జట్లు టాప్-4 స్థానాల కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ఫార్మాట్ ప్రకారం లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. టాప్-2లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరగనుండగా.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి.
క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్లో గెలిచిన టీమ్తో క్వాలిఫయర్-2 ఆడుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తోంది. టాప్-2లో నిలిచిన జట్లకు క్వాలిఫయర్-1లో ఓడినా.. క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలోనే టాప్-2లో నిలిచేందుకు ఐపీఎల్ టీమ్స్ ప్రాధాన్యత ఇస్తాయి.

ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఇవే..
55 మ్యాచ్లు ముగిసే సరికి పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. ఆర్సీబీ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. తమ చివరి మూడు మ్యాచ్ల్లో ఒకటి గెలిచినా ఆర్సీబీ టాప్-2 ప్లేస్ ఖరారు అవుతోంది. ఒకవేళ ఓడినా మెరుగైన రన్రేట్ ఉంటే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తోంది. ప్రస్తుతానికి ఆర్సీబీతో పాటు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్లకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మూడు మ్యాచ్ల్లో ఒక్క విజయమైనా సాధించాలి. అప్పుడే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. గుజరాత్ టైటాన్స్ తమ చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.
డేంజర్ జోన్లో ఢిల్లీ..
ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ చివరి 3 మ్యాచ్ల్లో రెండు గెలవాలి. ప్లే ఆఫ్స్ చేరడానికి ప్రతీ జట్టు 16 పాయింట్స్ సాధించాల్సి ఉంటుంది. టాప్-2లో నిలవాలంటే 18-20 పాయింట్స్ సొంతం చేసుకోవాలి. 55 మ్యాచ్ల తర్వాత ఆర్సీబీకి 95 శాతం, పంజాబ్ కింగ్స్కు 92 శాతం, ముంబై ఇండియన్స్కు 80 శాతం, గుజరాత్ టైటాన్స్కు 90 శాతం ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. 50 శాతం అవకాశాలతో ఢిల్లీ క్యాపిటల్స్ డేంజర్ జోన్లో ఉంది. సన్రైజర్స్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మారాయి.
లక్నో, కేకేఆర్ ఔట్..?
పంజాబ్తో ఓటమి తర్వాత లక్నో తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు తదుపరి మూడు మ్యాచ్లు మూడింటిని మెరుగైన రన్రేట్తో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. కేకేఆర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. రాజస్థాన్ రాయల్స్పై విజయంతో కేకేఆర్.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. అయితే కేకేఆర్ కూడా తమ చివరి మూడు మ్యాచ్లకు మూడింటిని మెరుగైన రన్రేట్తో గెలవాల్సి ఉంటుంది.