ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది దశకు చేరింది. ఆదివారం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్తో లీగ్ దశకు తెరపడనుంది. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్-బీ నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్కు అర్హత సాధించాయి. అయితే ఇంకా సెమీఫైనల్లో తలపడే జట్లు ఏవో ఖరారు కాలేదు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆఖరి లీగ్ మ్యాచ్ ఫలితంతో గ్రూప్-ఏ టాపర్ ఎవరో తేలనుంది. ప్రస్తుతం గ్రూప్-ఏ టాపర్గా న్యూజిలాండ్ కొనసాగుతోంది. భారత్ కంటే ఆ జట్టు రన్రేట్ మెరుగ్గా ఉంది.
గ్రూప్-బీలో 5 పాయింట్లతో సౌతాఫ్రికా అగ్రస్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే.. గ్రూప్ బీ రన్నరప్ ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్ ఆడనుంది. అప్పుడు న్యూజిలాండ్ లాహోర్ వేదికగా జరిగే రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడితే మాత్రం తొలి సెమీఫైనల్లో గ్రూప్-బీ టాపర్ సౌతాఫ్రికాతో తలపడనుండగా.. న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.

న్యూజిలాండ్పై భారత్ విజయం సాధిస్తే
మార్చి 4: తొలి సెమీఫైనల్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, దుబాయ్
మార్చి 5: రెండో సెమీఫైనల్: న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా, లాహోర్
న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడితే..
మార్చి 4: తొలి సెమీఫైనల్: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా, దుబాయ్
మార్చి 5: రెండో సెమీఫైనల్: న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, లాహోర్
ఆస్ట్రేలియాతోనే ఉండాలి..
టీమిండియా సెమీస్ ఆస్ట్రేలియాతోనే ఉండాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి పెద్దగా అనుభవం లేదని తెలిపాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హజెల్ వుడ్ లేరని చెప్పాడు.
'గ్రూప్-బీలో సెమీస్ చేరిన రెండు జట్లు బలమైనవే. ఎలాంటి తప్పు చేసినా టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గెలిస్తే ఫైనల్కు.. ఓడితే ఇంటికి అనే విషయం వారికి తెలుసు. కాబట్టి టీమిండియా తమ సెమీస్ ప్రత్యర్థి ఎవరా? అని ఆలోచిస్తుందని అనుకోవడం లేదు. కాకపోతే ఆస్ట్రేలియా సెమీస్ ప్రత్యర్థిగా ఉండాలని కోరుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో ఇటీవల ఎక్కువ క్రికెట్ ఆడారు.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ఓడించిన సౌతాఫ్రికా కంటే ఆసీస్ అయితేనే బాగుంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. ప్రధాన బౌలర్లు స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ గాయంతో ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆసీస్ను తమ సెమీస్ ప్రత్యర్థిగా టీమిండియా కోరుకునే అవకాశం ఉంది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.