టెస్ట్ క్రికెట్లో గత 12 ఏళ్లుగా సొంతగడ్డపై టీమిండియా అజేయంగా నిలవడానికి ప్రధాన కారణం స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా. గత దశాబ్దంగా ఈ ఇద్దరు తమ స్పిన్తో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టారు. అయితే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో జడేజా ఒంటరయ్యాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా? అనే ప్రశ్న తలెత్తింది.
ఇప్పటికే జట్టులో రవీంద్ర జడేజాకు తోడుగా వాషింగ్టన్ సుందర్ ఉండగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బీసీసీఐ మాత్రం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లను కాకుండా యువ స్పిన్నర్ తనుష్ కోటియన్ను ఎంపిక చేసింది. 26 ఏళ్ల తనుష్ కోటియన్ దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మహరాష్ట్రకు చెందిన తనుష్ కొటియన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు.

ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన తనుష్ కోటియన్ 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అశ్విన్లాగే బ్యాటింగ్ కూడా చేయగల తనుష్ కోటియన్.. రెండు శతకాలతో పాటు 13 హాఫ్ సెంచరీలతో 1525 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 41 కావడం విశేషం.
గతేడాది ముంబై రంజీ ట్రోఫీ గెలవడంతో తనుష్ కోటియన్దే కీలక పాత్ర. ఈ టోర్నీలో తనుష్ 29 వికెట్లు తీయడంతో పాటు 502 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డ్ అందుకున్నాడు. ఇటీవల భారత్-ఏ జట్టుతో ఆస్ట్రేలియాలో పర్యటించాడు. ఈ ప్రదర్శనతోనే తనుష్ కోటియన్ను జట్టులోకి తీసుకున్నామని కూడా రోహిత్ శర్మ తెలిపాడు.
అశ్విన్ తరహాలోనే తనుష్ కోటియన్ వద్ద కూడా వైవిధ్యమైన బంతులున్నాయి. ముఖ్యంగా ఊరించే బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం తనుష్ స్పెషాలిటీ. అతని బౌలింగ్ ఆడే ప్రయత్నంలో బ్యాటర్లు స్లిప్ క్యాచ్గా వెనుదిరుగుతారు. కొన్ని బంతులు అనూహ్యంగా నేరుగా వచ్చి ఎల్బీ డబ్ల్యూకు కారణం అవుతాయి. భారత పిచ్లపై అతను సమర్థవంతంగా బౌలింగ్ చేయగలడు. కానీ సొంతగడ్డపై అతనికి తుది జట్టులో అవకాశం ఇస్తారా? లేదా? అనేది చూడాలి.