
ముంబై: టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన ప్రేయసి మిథాలీ పారుల్కర్ను పెళ్లి చేసుకున్నాడు. సోమవారం ముంబైలో శార్దూల్ వివాహం ఘనంగా జరిగింది. కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడ్డ ఈ ఇద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో రెండేళ్ల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో రెండేళ్లపాటు వివాహాన్ని వాయిదా వేసుకున్న శార్దూల్-మిథాలీ.. సోమవారం ఆ పనిని కూడా పూర్తి చేశారు. ఇక శార్దూల్ సతీమణి మిథాలీ పార్కర్ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఎవరు? ప్రొఫెషన్ ఏంటని, శార్దూల్కు ఎలా పరిచయమైందనే వివరాలు ఆరా తీస్తున్నారు.
మిథాలీ పారుల్కర్ ఓ వ్యాపారవేత్త. మహారాష్ట్రలోని థానేలో ఆమె 'ఆల్ ది జాస్.. లగ్జరీ బేకర్స్' పేరిట ఓ బేకరీ సంస్థను స్థాపించారు. ముంబైలోనూ ఈ సంస్థకు బ్రాంచ్లు ఉన్నాయి. 2020 ఫిబ్రవరిలో ఈ సంస్థను ప్రారంభించిన మిథాలీ.. అదే పేరుతో ఓ వెబ్సైట్ను మొదలుపెట్టి సేవలు అందిస్తోంది. వివిధ రకాల కేక్లు, కుకీస్, బ్రెడ్ తదితర బేకరీ ఉత్పత్తులను ఆన్లైన్, ఆఫ్ లైన్ వేదికగా ఈ సంస్థ విక్రయిస్తోంది. వ్యాపారాన్ని ప్రారంభించిన అనతి కాలంలోనే మిథాలీ పారుల్కర్ మంచి పేరును సంపాదించింది.

శార్దూల్ ఠాకూర్తో నిశ్చితార్థం అనంతరం ఆమె క్రేజ్ భారత్ మొత్తానికి విస్తరించింది. 1992లో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ పెద్ద కుటుంబంలో మిథాలీ పారుల్కర్ జన్మించారు. ఆమె విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. 2014లో మిథీబాయ్ కాలేజీ నుంచి ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 2015లో ఉద్యోగ జీవితం మొదలుపెట్టిన మిథాలీ.. మల్టీనేషనల్ కంపెనీ జేఎస్డబ్ల్యూలో ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత 2017లో బ్లూస్టార్ డైమండ్స్లో కంపెనీ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించారు.

2018 అక్టోబరు వరకు అందులోనే పని చేసిన మిథాలీ.. 2019లో చేతక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థలో చేరి సెక్రెటరీగా పని చేశారు. 2020 వరకు ఆ సంస్థలో ఉన్న ఆమె మోడలింగ్ చేసేందుకు ఆసక్తి చూపింది. కానీ ఫలితం ఇవ్వకపోవడంతో ఆ రంగాన్ని వదిలేసి బేకరి ఉత్పత్తుల కంపెనీని స్థాపించి వ్యాపారం చేస్తోంది. థానేలో చదువుకుంటున్న రోజుల్లోనే శార్దూల్ ఠాకూర్తో మిథాలీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. పెంపుడు జంతువులు అంటే మిథాలీకి చాలా ఇష్టం.