హైదరాబాద్: 'రింకూ సింగ్'.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారు మోగుతున్న పేరు. ఐపీఎల్ 2023 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఉత్తర ప్రదేశ్ ప్లేయర్ అసాధారణ ఇన్నింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్లు బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు.
చివరి 5 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన పరిస్థితిలో ఐదు సిక్స్లు బాది కేకేఆర్ను గెలిపించాడు. ఈ సంచలన ఇన్నింగ్స్తో రింకూ సింగ్ కేకేఆర్ సూపర్ స్టార్గా నిలిచిపోయాడు. కేకేఆర్ నయా స్టార్గా నిలిచిన రింకూ సింగ్ బ్యాక్ గ్రౌండ్ ఆసక్తికరం స్పూర్తిదాయకం. రింకూ సింగ్ది దిగువ మధ్య తరగతి కుటుంబం.

ఉత్తర ప్రదేశ్లోని అలీగఢ్ రింకూ సింగ్ స్వస్థలం. రెండు గదులు ఉన్న ఓ చిన్న క్వార్టర్లో నివాసం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉండేవాడు. తల్లిదండ్రులు, చెల్లెలు, అన్న జీతూసింగ్, చెల్లెలు నేహాసింగ్, వదిన, వారి పిల్లలతో కలిసి నివసించేవాడు. తండ్రి ఖన్చంద్ది గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరి చేసే ఉద్యోగం. తల్లి వీణా దేవి గృహణి. జీతూసింగ్ ఆటోడ్రైవర్.
చిన్నప్పటి నుంచే రింకూ సింగ్ క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే బలమైన కోరికతో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. సచిన్ టెండుల్కర్, సురేష్ రైనా అతని ఆరాధ్య క్రికెటర్లు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడే కష్టంలో తానూ పాలుపంచుకునేవాడు. దీనికోసం ఒకదశలో ఓ ప్రైవేట్ కార్యాలయంలో స్వీపర్గా కొద్దిరోజులు పని చేశాడు.
ఆటోడ్రైవర్గానూ కష్టపడ్డాడు.పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువును మానేశాడు. ఓ కోచ్ సాయంతో క్రికెట్ కెరీర్ను ప్రారంభించిన రింకూ సింగ్.. 2017లో పంజాబ్ కింగ్స్ తరఫున రూ.10 లక్షల బేస్ ప్రైజ్తో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018లో కేకేఆర్ అతన్ని రూ.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఆ సీజన్లో కేకేఆర్ తరఫున ఆడే అవకాశం అందుకున్నాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. మరుసటి సీజన్లోనూ తేలిపోయాడు. అదే నేపథ్యంలో 2020లోనూ ఒకే మ్యాచ్ ఆడి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 2021లో మోకాలి గాయం కారణంగా మొత్తం టోర్నీకే దూరమయ్యాడు.
కానీ, 2022లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తాజా సీజన్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. గుజరాత్తో ఆడిన తాజా ఇన్నింగ్స్ అతన్ని మరో స్థాయిలో నిలబెట్టింది.