
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టెస్ట్ వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఈ పర్యటనలోని మూడు టెస్ట్ల సిరీస్కు దూరమయ్యాడనే విషయం తెలిసిందే. దాంతో అతనిస్థానంలో భారత్-ఏ కెప్టెన్, గుజరాత్ ప్లేయర్ ప్రియాంక్ పాంచల్ను ఎంపిక చేశారు. దాంతో గత 24 గంటలుగా ఈ యువ ప్లేయర్ పేరు మారుమోగుతుంది. అసలు ఎవరీ ప్రియాంక్ పాంచల్ అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా తెలియని ప్రియాంక్ పాంచాల్.. భారత దేశవాళీ క్రికెట్లో మాత్రం టాప్ క్లాస్ ఓపెనర్. డొమెస్టిక్ క్రికెట్లో గుజరాత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ 31 ఏళ్ల ఓపెనర్.. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై పర్యటించిన భారత్-ఎ జట్టుకి సారథ్యం వహించాడు. ఈ అనాధికారిక టెస్ట్ సిరీస్లో 96, 24, 0, 31 పరుగులు చేశాడు. ఈ సిరీస్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించాడు.
అహ్మదాబాద్కు చెందిన ప్రియాంక్ పాంచల్కు దేశవాళీ క్రికెట్లో అసాధారణ రికార్డులు ఉన్నాయి. 2008లో డొమెస్టిక్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన ప్రియాంక్ ఇప్పటివరకు 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 45.52 సగటుతో 7,011 పరుగులు చేశాడు. ప్రియాంక్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 24 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. 314 నాటౌట్ అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా... 2016-17 రంజీ సీజన్లో 1,310 పరుగులు చేసాడు. అతని సూపర్ బ్యాటింగ్తో ఆ ఏడాది గుజరాత్ చాంపియన్గా నిలిచింది. గుజరాత్కు ఇదే ఫస్ట్ రంజీ ట్రోఫీ కావడం విశేషం.
2017-18 రంజీ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లోనే 542 పరుగులు చేసిన ప్రియాంక్ పాంచాల్.. 2018-19లో 9 మ్యాచ్ల్లో 898 పరుగులతో సత్తాచాటాడు. భారత్-ఎ జట్టు తరఫున నిలకడగా ఆడుతూ.. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మన్నలు పొందిన ప్రియాంక్ పాంచాల్.. తాజాగా టీమిండియా తలుపు తట్టాడు. గతంలో ఇంగ్లండ్ పర్యటనకు కూడా అతను స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
అయితే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో కూడా చోటు దక్కడం కష్టమే. ఇప్పటికే జట్టులో సీనియర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉండగా.. ఇప్పుడు ప్రియాంక్ పాంచాల్ని మూడో ఓపెనర్గా భారత్ తీసుకుంది. దాంతో.. అతను ఛాన్స్ కోసం వేచి ఉండక తప్పదు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మయాంక్ అగర్వాల్ సెంచరీతో రాణించి ఫామ్లో ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరైనా గాయపడితేనే ప్రియాంక్ పాంచల్కు చోటు దక్కనుంది.