హైదరాబాద్: భారత క్రికెట్లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరని అడగ్గానే అందరూ టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ లేదా ధోనీ పేరు చెబుతుంటారు. కానీ ఇద్దరి కంటే ధనవంతుడైన భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. అతను ఎవరో కాదు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగిన సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.
సోషల్ మీడియా లేని కాలంలోనే తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందాడు. 16 ఏళ్ల పసిప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సచిన్.. మరెవరీకి సాధ్యం కాని రికార్డులను నెలకొల్పాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా చరిత్రకెక్కాడు.

ఆటలోనే కాకుండా సంపాదనలో సచిన్ సత్తా చాటాడు. అప్పట్లో అనేక వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న సచిన్.. ప్రచారకర్తగా కోట్లు ఆర్జించాడు. ఇప్పటికీ సంపాదిస్తూనే ఉన్నాడు. బిజినెస్ వర్గాల సమాచారం ప్రకారం సచిన్ టెండూల్కర్ నెట్వర్త్ రూ.1250 కోట్లు. ఇది ఈతరం క్రికెట్లో రారాజుగా కొనసాగుతున్న కోహ్లీ కంటే ఎక్కువ. భారత క్రికెట్లో అత్యధిక సంపద కలిగిన ఆటగాడిగా సచిన్ ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
ముంబైలో సొంతంగా ఫైవ్ స్టార్ హోటల్స్ కలిగిఉన్న సచిన్.. స్పిన్నీ, స్మాష్ వంటి సంస్థల్లో భాగస్వామిగా కొనసాగుతున్నాడు. కొన్ని కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. సచిన్ తర్వాత రూ. 1050 కోట్ల నెట్వర్త్తో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. రూ.1040 కోట్ల నెట్వర్త్తో ధోనీ మూడో స్థానంలో నిలిచాడు. సౌరవ్ గంగూలీ నికర ఆధాయం రూ.700 కోట్లు ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ రూ.345 కోట్లు, యువరాజ్ సింగ్ రూ.285 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

విరాట్ కోహ్లీ, ధోనీ వివిధ కంపెనీలకు ప్రచారకర్తలుగా డబ్బులు ఆర్జిస్తుండగా... మాజీ క్రికెటర్లు కామెంటేటర్స్, ఎక్స్పర్ట్స్గా, క్రికెట్ అకాడమీలతో పాటు ఇతర వ్యాపారాలతో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.