బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహముద్ పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. భారత్తో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్లో ఈ 24 ఏళ్ల యువ పేసర్ నిప్పులు చెరిగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఊహించని షాకిచ్చాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో వరల్డ్ బెస్ట్ బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్లను పెవిలియన్ చేర్చాడు.
అతని ధాటికి టీమిండియా 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను హసన్ మహముద్ ఔట్ చేసి విధానం అందర్నీ ఆకట్టుకుంది. విరాట్ కోహ్లీ బలహీనతను టార్గెట్ చేస్తూ.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలతో అతన్ని హసన్ మహముద్ ఇబ్బంది పెట్టాడు. ఇన్ స్వింగర్, ఔట్ సింగర్స్తో అయోమయానికి గురి చేశాడు.

చివరకు విరాట్ కోహ్లీనే బంతిని వెంటాడి ఔటయ్యే పరిస్థితిని కల్పించాడు. రోహిత్ శర్మను అదే తరహాలో స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. శుభ్మన్ గిల్ను అద్భుతమైన ఇన్స్వింగర్తో వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. నిలకడగా ఆడుతూ కాస్త జోరు కనబర్చిన రిషభ్ పంత్ను ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో చెక్ పెట్టాడు. వ్యూహాత్మకమైన బౌలింగ్తో భారత బ్యాటర్లను ఔట్ చేసిన హసన్ మహముద్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి.
అతని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తిచూపిస్తున్నారు. ఎవడ్రా వీడు.. ఇంత టాలెంటెడ్గా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 24 ఏళ్ల మహముద్ మార్చి 2020లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన మహమూద్ ఈ ఏడాది మొదట్లో శ్రీలంకతో జరిగిన సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.
ఇటీవల పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఆ ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. పాకిస్థాన్ గడ్డపై బంగ్లాదేశ్ 2-0తో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంలో హసన్ మహముద్ కీలక పాత్ర పోషించాడు. చెన్నై టెస్టుకు ముందు మూడు టెస్ట్లు మాత్రమే ఆడిన మహముద్ 14 వికెట్లు పడ్డగొట్టాడు. వన్డేల్లో 30, టీ20ల్లో 18 వికెట్లు తీసుకున్నాడు.
చెన్నై పిచ్కు తగ్గట్లు బౌలింగ్ చేసి భారత టాపార్డర్ను కుప్పకూల్చిన హసన్ మహముద్కు మంచి భవిష్యత్తు ఉందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హసన్ మహముద్ ధాటికి తేలిపోయిన టీమిండియా.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పోరాటంతో గట్టెక్కింది. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అశ్విన్-జడేజా ఆదుకున్నారు. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఇద్దరూ ఇప్పటికే 140 పరుగులు జోడించారు.