'దేవంద్ర సింగ్ బోరా'.. ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను గోల్డెన్ డకౌట్ చేసిన ఈ దేశవాళీ పేసర్ టాక్ ఆఫ్ ది నేషన్గా మారాడు. సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ శర్మను తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26ని భారీ శతకంతో ప్రారంభించిన రోహిత్ శర్మ.. దేవంద్ర సింగ్ బోరా ధాటికి రెండో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరగాడు. ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా జైపూర్ వేదికగా ముంబై వర్సెస్ ఉత్తరఖాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముంబై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా.. తొలి ఓవర్లోనే ఎదొర్కొన్న తొలి బంతికే రోహిత్ శర్మ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఉత్తరఖాండ్ బౌలర్ దేవంద్ర సింగ్ బోరా బౌలింగ్లో జగ్మోహన్ నాగర్కోటికి క్యాచ్ ఇచ్చి రోహిత్(0) వెనుదిరిగాడు. దాంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసేందుకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రోహిత్ శర్మను గోల్డెన్ డక్ చేసిన దేవంద్ర సింగ్ బోరా గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఉత్తరఖాండ్కు చెందిన దేవేంద్ర సింగ్ బోరా 25 ఏళ్ల రైట్ ఆర్మ్ మీడియం పేసర్. తాను ఆడుతున్న మూడో లిస్ట్-ఏ మ్యాచ్లోనే రోహిత్ శర్మను ఔట్ చేయడం విశేషం. కొత్త బంతితో స్వింగ్ చేయడం.. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకత. తన తొలి ఓవర్లోనే రోహిత్ శర్మను ఔట్ చేయడం ద్వారా దేవేంద్ర సింగ్ బోరా ఆత్మవిశ్వాసం రెట్టింపుకానుంది.
ఇప్పటి వరకు మూడు లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడిన దేవేంద్ర సింగ్ 19.5 యావరేజ్, 20.2 స్ట్రైక్రేట్తో వికెట్లు తీసాడు. హిమాచల్ ప్రదేశ్తో జరిగిన గత మ్యాచ్లో దేవేంద్ర సింగ్(4/44) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15 మ్యాచ్ల్లో బోరా 41.13 యావరేజ్తో 30 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరఖాండ్ ప్రీమియర్ లీగ్లో 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు అభిమానులు ఉదయం 7 గంటల నుంచే స్టేడియం బయట పడిగాపులు కాచారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మరో రెండు స్టాండ్స్లోకి అభిమానులను అనుమతించింది. కానీ వారిని రోహిత్ తీవ్రంగా నిరాశపర్చాడు.
7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీ బరిలోకి దిగిన రోహిత్.. సిక్కింతో బుధవారం జరిగిన మ్యాచ్లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తనదైన దూకుడుతో 61 బంతుల్లోనే శతకం సాధించి ఈ టోర్నీలో ఈ ఘనతను అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డ్ సాధించాడు. రోహిత్ శర్మకు ఇది 37వ లిస్ట్ ఏ సెంచరీ కాగా.. కెరీర్లో ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ శతకం. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ తనదైన శైలిలో చెలరేగాడు. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయాడు.