ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తరఫున 23 ఏళ్ల అశోక్ శర్మ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే గుజారత్ టైటాన్స్ ఈ కుర్రాడికి అవకాశం ఇవ్వడంతో అతని పేరు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నయా పేసర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్ శర్మ తండ్రి హుకమ్ చంద్ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్గా చూడాలనేది ఆయన కోరిక.
తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్గా చెప్పుకుంటాడు.

ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్గా నిలిచాడు. తన తొలి ప్రొఫెషనల్ టీ20లో తమిళనాడుపై మూడు, త్రిపురపై రెండు వికెట్లు తీశాడు. కర్ణాటకపై 3/43 ప్రదర్శన చేశాడు. ఉత్తరాఖండ్, సౌరాష్ట్రలపై వరుసగా నాలుగు వికెట్ల హాల్స్, ఢిల్లీపై రెండు వికెట్లు పడగొట్టాడు.
అతని బౌలింగ్ను ఆడేందుకు బ్యాటర్లు జంకుతారు. ఏ మాత్రం బంతి మిస్సై శరీరానికి తాకిన తీవ్ర గాయం అవుతుంది. గతంలో కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్కు నెట్ బౌలర్గా సేవలు అందించాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ టీమ్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసినా.. తుది జట్టులో అవకాశం దక్కలేదు.
ఆర్సీబీ ట్రయల్స్కు కూడా వెళ్లిన అశోక్ శర్మను గుజరాత్ టైటాన్స్ పక్కా ప్లాన్తో వేలంలో కొనుగోలు చేసింది. అశోక్ శర్మ మంచి ప్రతిభ కలిగిన బౌలర్ అని, తమ జట్టుకు ప్రధాన బౌలర్ అవుతాడని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు.