దేశవాళీ క్రికెట్ చరిత్రలో అతను ఒక సంచలనం.. ముంబై క్రికెట్కు పునాది రాళ్ళలా నిలిచిన సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీల సమకాలీనుడైనా.. అద్భుత ప్రదర్శనతో వారి సరసన నిలిచినా.. అతనికి అంతర్జాతీయ వేదికపై నిరూపించుకునే అవకాశం దక్కలేదు. అపారమైన ప్రతిభ.. 11 వేల పరుగులు, 30 సెంచరీలు సాధించినా... భారత జెర్సీని ధరించే అదృష్టం మాత్రం అతనికి దక్కలేదు. కానీ కాలం మారింది. చేతిలో బ్యాట్ పట్టుకోనివ్వని విధి, ఇప్పుడు కోచింగ్ రూపంలో ఒక గొప్ప బాధ్యతను ఆయన భుజాలపై ఉంచింది. ఆయన ఎవరో కాదు.. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో భారత జట్టును ఫైనల్ చేర్చిన ద్రోణాచార్యుడు అమోల్ ముజుందార్.!
నిన్నటివరకు అతని బాధ...టీమిండియాకు తాను ఆడలేకపోయానే అని. ఇవాళ ఆయన లక్ష్యం... తన శిష్యురాళ్లు భారత కప్పు కలలను సాకారం చేయాలని. తాను దాటలేని గీతను తన శిష్యులు దాటేలా చేసి, ప్రపంచ క్రికెట్కు భారత మహిళా శక్తిని చూపించాలని కంకణం కట్టుకున్న గొప్ప కోచ్. వరుస ఓటములతో చతికిల పడ్డ భారత జట్టు ఫైనల్ చేరిందంటే దానికి ప్రధాన కారణం అమోల్ ముజుందార్. సెమీఫైనల్ విజయానంతరం ఈ విషయాన్ని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. జీవితం ప్రతీ ఒక్కరికి రెండో అవకాశం ఇస్తుంది.. అమోల్ ముజుందార్కు కూడా మహిళల హెడ్ కోచ్ రూపంలో మరో ఛాన్స్ ఇచ్చింది. అతని జీవిత ప్రయాణం గురించి తెలుసుకుంటేనే ఈ విషయం మనకు అర్థమవుతుంది.

మహారాష్ట్రకు చెందిన అమోల్ ముజుందార్ 1974 నవంబర్ 11న జన్మించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కోచ్ అయిన రమాకాంత్ అచ్రేకర్ దగ్గరే శిక్షణ తీసుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ముజుందార్ 1993-94 రంజీ సీజన్లో ముంబై జట్టు తరఫున దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. హర్యానాతో జరిగిన అరంగేట్ర మ్యాచ్లో 260 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా.. జూనియర్ సచిన్గా గుర్తింపు పొందినా అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కలేదు.
సుదీర్ఘ దేశవాళీ క్రికెట్లో ముంబైతో పాటు అస్సాం, ఆంధ్ర ప్రదేశ్ జట్లకు ముజుందార్ ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 171 ఫస్ల్ క్లాస్ మ్యాచ్ల్లో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలతో 11,167 పరుగులు చేశాడు. 2006-07 రంజీ సీజన్లో ముంబై కెప్టెన్గా టైటిల్ గెలిచాడు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి వంటి తన సమకాలీకులతో పాటు జూనియర్ క్రికెట్లో ఆడాడు. కానీ భారత్ తరఫున ఆడే అవకాశం మాత్రం అతనికి దక్కలేదు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్గా కెరీర్ ప్రారంభించిన ముజుందార్.. 2019లో సౌతాఫ్రికా జట్టుకు తాత్కలిక బ్యాటింగ్ కోచ్గా పని చేశాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ జాతీయ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గా, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా సేవలందించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో భారత్ అండర్ 19, అండర్ 23 జట్లకు కోచ్గా వ్యవహరించాడు. 2021-22 దేశవాళీ సీజన్లో ముంబై జట్టుకు హెడ్ కోచ్గా పనిచేశాడు. 2023లో భారత మహిళల జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా విజయం సాధిస్తే 52 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. ఈ ఘనతను అందించిన కోచ్గా అమోల్ ముజుందార్ పేరు సువర్ణక్షరాలతో లిఖించబడుతుంది. ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.