భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ కాంట్రాక్ట్ల్లో యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసిన బీసీసీఐ.. వెటరన్ ప్లేయర్లకు మొండి చెయ్యి చూపించింది. ఇక దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వని ఆటగాళ్లపై కూడా చర్యలు తీసుకుంది.
జట్టులో చోటు కోల్పోయిన ఆటగాళ్లతో పాటు పేలవ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లను కూడా కాంట్రాక్ట్ల నుంచి తప్పించింది. అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రమోషన్ ఇచ్చిన బోర్డు.. ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లకు డిమోషన్ ఇచ్చింది. గతేడాది బీసీసీఐ కాంట్రాక్ట్లు అందుకున్న ఆటగాళ్లలో మొత్తం 11 మందికి తాజా కాంట్రాక్ట్ల్లో చోటు దక్కలేదు.

ఇందులో వెటరన్ ప్లేయర్లు శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్తో పాటు మరో 9 మంది ఉన్నారు. వీరంతా వివిధ కారణాలతో కాంట్రాక్ట్లను నిలబెట్టుకోలేకపోయారు. దేశవాళీ క్రికెట్ ఆడకుండా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
గతేడాది బీ గ్రేడ్ కాంట్రాక్ట్లో ఉన్న అయ్యర్.. సీ గ్రేడ్లో ఇషాన్ కిషన్కు ఈ సారి ఎలాంటి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్న యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు కూడా కాంట్రాక్ట్లను నిలబెట్టుకోలేకపోయారు.
'ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్ల రికమండేషన్స్లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను పరిగణలోకి తీసుకోలేదు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని సమయాల్లో ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీసీఐ సూచించింది.'అని తమ ప్రకటనలో పేర్కొంది.
కాంట్రాక్ట్లు కోల్పోయిన ఆటగాళ్లు
అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్
ప్రమోషన్ పొందిన ఆటగాళ్లు
కేఎల్ రాహుల్(గ్రేడ్ బీ నుంచి ఏ), మహమ్మద్ సిరాజ్(గ్రేడ్ బీ నుంచి ఏ), శుభ్మన్ గిల్(గ్రేడ్ బీ నుంచి ఏ), కుల్దీప్ యాదవ్(గ్రేడ్ సీ నుంచి బీ)
డిమోషన్ పొందిన ఆటగాళ్లు:
రిషభ్ పంత్(గ్రేడ్ ఏ నుంచి బీ), అక్షర్ పటేల్(గ్రేడ్ ఏ నుంచి బీ)
2023-24 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్లు:
గ్రేడ్ ఏ ప్లస్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ ఏ: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా
గ్రేడ్ బీ: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్
గ్రేడ్ సీ: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పాటిదార్.