ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఘన విజయంతో సిరీస్ను ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకే కుప్పకూలింది. అనంతరం జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 104 పరుగులకే ఆలౌటైంది.
46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ శతకాలతో 487/6 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కానీ భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో ఆసీస్ 238 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ గురైన టీమిండియా.. ఆసీస్ గడ్డపై మాత్రం ఊహించని విజయాన్నందుకుంది. ఇదే జోరులో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్ట్ కోసం సన్నదమవుతోంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. గాయంతో ఫస్ట్ మ్యాచ్ ఆడని శుభ్మన్ గిల్ కూడా కోలుకున్నాడు.
పింక్ బాల్ టెస్ట్కు ముందు టీమిండియా రెండు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ పింక్ బాల్ సన్నాహక మ్యాచ్లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టీమ్ ప్రెసిడెంట్ ఎలెవన్తో తలపడనుంది. శనివారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్.. ఆదివారం వరకు జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు రోజుల వామప్ మ్యాచ్ను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. హాట్ స్టార్తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్లో ఈ మ్యాచ్ రానుంది.
భారత జట్టు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, సర్ఫరాజ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, రవీంద్ర జడేజా, అభిమన్యు ఈశ్వరన్
ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్: జాక్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), చార్లీ అండర్సన్, మహిల్ బియర్డ్మన్, స్కాట్ బోలాండ్, జాక్ క్లేటన్, ఎయిడన్ ఓ కోన్నర్, ఓలీ డేవిస్, జయ్డెన్ గుడ్విన్, సామ్ హర్పర్, హన్నో జాకోబ్స్, సామ్ కోన్స్టాస్, లాయ్ పోప్, మాథ్యూ రేన్షా, జేమ్ ర్యాన్