ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్కు ఒక్క అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. జట్టులోని ఇద్దరి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి.. సచిన్ తనయుడిని పక్కనపెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నమన్ ధిర్, అన్సుల్ కాంబోజ్, క్వేనా మఫాకా వంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి అర్జున్ టెండూల్కర్ను బెంచ్కు పరిమితం చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో రూ. 20 లక్షల కనీస ధరతో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్.. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాదే అరంగేట్రం చేశాడు.

ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరఫున 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన అర్జున్ టెండూల్కర్..9.36 ఎకానమీతో 3 వికెట్లు తీసాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో పేస్ లేకపోవడమే అతని ప్రధాన సమస్య. ఈ క్రమంలోనే బౌలింగ్లో పేస్ పెంచడంపై ఫోకస్ పెట్టిన అర్జున్ టెండూల్కర్.. బ్యాటింగ్ను కూడా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీలో గోవా తరఫున అర్జున్ టెండూల్కర్ పర్వాలేదనిపించాడు. గుజరాత్ జట్టుతో చివరి సారిగా ఆడిన అతను ఆ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 49 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీసాడు. గతంలో కంటే బౌలింగ్, బ్యాటింగ్లో అర్జున్ మెరుగైనప్పటికీ.. హార్దిక్ పాండ్యా అతనికి ఒక్క అవకాశం ఇవ్వలేదు.
అయితే అర్జున్ టెండూల్కర్ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు హార్దిక్ చర్యను సమర్థిస్తుంటే.. సచిన్ అభిమానులు మాత్రం తప్పుబడుతున్నారు. లోయరార్డర్లో అతను బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ కూడా చేస్తాడని, జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ సీజన్లో ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న ముంబై ఇండియన్స్.. చివరి రెండు మ్యాచ్ల్లోనైనా అర్జున్ టెండూల్కర్కు అవకాశం ఇస్తుందో లేదో..? చూడాలి.