వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీ ఆడటమే లక్ష్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆ దిశగా అడుగులు వేసారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. ఆఖరి మ్యాచ్లో అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఒక్క మ్యాచ్లోనే విఫలమైన రోహిత్.. తర్వాతి రెండు మ్యాచ్ల్లో తన సత్తా ఏంటో చూపించాడు. ఓ హాఫ్ సెంచరీ, శతకంతో తనలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పాడు.
202 పరుగులతో ఈ సిరీస్లో రోహిత్ శర్మ టాప్ స్కోరర్గా నిలవగా.. భారత్ తరఫున 74 పరుగులతో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. తమ సామర్థ్యంపై సందేహాలను పోగొట్టిన రో-కో ప్రస్తుతానికి అయితే పరీక్షలో పాసైంది. ప్రపంచకప్ టోర్నీకి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండటంతో అప్పటి వరకు ఈ ఇద్దరూ జట్టులో కొనసాగుతారా? అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ రెండేళ్లలో టీమిండియా ఆడే వన్డేల సంఖ్య కూడా చాలా తక్కువ. ఒకే ఫార్మాట్లో ఆడుతూ ఫామ్, ఫిట్నెస్ కాపాడుకోవడం రోహిత్, కోహ్లీలకు పెద్ద సవాలే.

ఆస్ట్రేలియా గడ్డపై ఆఖరి పోరులో అదరగొట్టిన కోహ్లీ, రోహిత్లు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. నవంబర్ 30న రాంచీ వేదికగా తొలి వన్డే, డిసెంబర్ 3న రాయ్పూర్ వేదికగా రెండో వన్డే, డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
అయితే ఈ మూడు వన్డేల సిరీస్ కంటే ముందే కోహ్లీ, రోహిత్ మైదానంలోకి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం సౌతాఫ్రికా-ఏ జరిగే మూడు అనధికార వన్డేల్లో రో-కో బరిలోకి దిగే అవకాశం ఉంది. కనీసం చివరి అనధికార వన్డేలోనైనా ఆడవచ్చు. రెండు అనధికార టెస్ట్ మ్యాచ్లకు జట్టును ప్రకటించిన భారత సెలెక్షన్ కమిటీ అనధికార వన్డేలకు ఇంకా జట్టును ఎంపిక చేయలేదు. రో-కో కోసమే ఆగుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 13 నుంచి సౌతాఫ్రికా-ఏతో ఈ మూడు అనధికార వన్డేల సిరీస్ జరగనుంది. రాజ్కోట్ వేదికగానే నవంబర్ 13న తొలి మ్యాచ్, నవంబర్ 16న రెండో మ్యాచ్, నవంబర్ 19న మూడో మ్యాచ్ జరగనుంది. ఈ మూడు అనధికార వన్డేల్లో కోహ్లీ, రోహిత్ ఆడితే టీమిండియా ఫ్యాన్స్కు 6 మ్యాచ్ల రూపంలో డబుల్ ట్రీట్ లభించనుంది.