భారత్-పాకిస్థాన్ యుద్దం నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను వారం పాటు వాయిదా వేసారు. ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
వారం రోజుల తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి షెడ్యూల్, మ్యాచ్ల వివరాలను వెల్లడిస్తామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. భారత సాయుధ దళాల బలంపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ, ఐపీఎల్ వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్లతో పాటు ఫైనల్తో సహా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడించాల్సి ఉంది.

అయితే 18 ఏళ్ల చరిత్రలో ఇలా మధ్యలో ఐపీఎల్ వాయిదాపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ కూడా ఇలానే మధ్యలో వాయిదా పడింది. కరోనా కారణంగా బయో బబుల్లో ప్రేక్షకులు లేకుండా భారత్ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహించారు. కానీ బబుల్ బ్రేక్ అవ్వడం.. ఆటగాళ్లకు వైరస్ సోకడంతో టోర్నీని వాయిదా వేసారు. ఆ తర్వాత యూఏఈ వేదికగా మిగతా టోర్నీని సెప్టెంబర్లో బీసీసీఐ పూర్తి చేసింది.
ఒకవేళ వారం రోజుల తర్వాత పరిస్థితులు అదుపులోకి రాకపోతే సెప్టెంబర్లోనే టోర్నీని పూర్తి చేయనున్నారు. ఆ సమయంలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ టోర్నీ రద్దయ్యే అవకాశాలున్నాయి. ఆ విండోను ఐపీఎల్ పూర్తి చేసేందుకు బీసీసీఐ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ వారం తర్వాత పరిస్థితి సద్దమణిగితే ఐపీఎల్ను కొనసాగించి.. జూన్ 2లోపూ పూర్తి చేయనున్నారు. మే చివరి వారంలో భారత్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షం కారణంగా రెండు మ్యాచ్లు తుడిచి పెట్టుకుపోయాయి.