కొండంత లక్ష్యం..
నాటి మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దిల్షాన్(165 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 160), సంగక్కర( 87 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగడంతో ఆ జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 320 పరుగులు సాధించింది. అనంతరం వర్షం కురవడంతో భారత్ లక్ష్యాన్ని 40 ఓవర్లకే కుదించారు. దాంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించాలంటే అద్భుతం జరగాలని అంతా భావించారు. కానీ, ఆ అద్భుతం పేరే విరాట్ కోహ్లీ అని తర్వాత నిరూపితమైంది.
మంచి ఆరంభంతో..
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(30), సచిన్ టెండూల్కర్(39) శుభారంభం అందించారు. ఇద్దరూ 6 ఓవర్లకే జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. దాంతో పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అనువైన మార్గం కల్పించారు. అయితే, సెహ్వాగ్ ఏడో ఓవర్లో ఔటైన కాసేపటికే.. సచిన్ సైతం పెవిలియన్ చేరాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 10 ఓవర్లకు 86/2గా నమోదైంది. తర్వాత జోడీ కట్టిన గంభీర్( 64 బంతుల్లో 4 ఫోర్లతో 63), విరాట్ కోహ్లీ ( 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 133 నాటౌట్) మూడో వికెట్కు శతక భాగస్వామ్యం నిర్మించారు. వీరు మొదట నెమ్మదిగా ఆడినా తర్వాత విజృంభించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 201 వద్ద గౌతీ రనౌటయ్యాడు. అప్పటికి భారత్ 13 ఓవర్లలో 120 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రైనా సాయంతో..
గంభీర్ ఔటయ్యాక టీమిండియాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సాధించాల్సిన రన్రేట్ కూడా ఎక్కువైంది. దాంతో సురేశ్ రైనా ( 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్)తో కలిసి బ్యాటింగ్ చేసిన విరాట్.. లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. మలింగ, కులశేఖర, పర్వేజ్ మహరూఫ్, తిసారా పెరీరా ఎవరినీ వదలకుండ బౌండరీలు బాదాడు. దాంతో ఓవర్కు 10 పరుగుల చొప్పున స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కోహ్లీ తనలోని క్లాస్ బ్యాటింగ్ను పరిచయం చేశాడు. ఎక్కడా భారీ షాట్లకు పోకుండా చూడముచ్చటైన కవర్ డ్రైవ్ షాట్లతో అలరించాడు. అసాధ్యం అనుకున్న కొండంత లక్ష్యాన్ని సుసాధ్యం చేశాడు. చివరికి 36.4 ఓవర్లలోనే విజయాన్నందించాడు.
మలింగాకు చుక్కలే..
యార్కర్ల కింగ్, వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన లసిత్ మలింగా బౌలింగ్ను విరాట్ చీల్చిచెండాడాడు. అతను వేసిన 35 ఓవర్లలో 2, 6, 4, 4, 4, 4 నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆ ఇన్నింగ్స్తోనే ప్రత్యర్థులందరికి హెచ్చరికలు జారీచేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దశబ్దకాలం తనదైన బ్యాటింగ్తో చెలరేగాడు. ఎన్నో చిరస్మరణీ ఇన్నింగ్స్లతో అద్భుత విజయాలందించాడు.