ఒకే ఓవర్లో 28 రన్స్.. విరాట్ కోహ్లీ ఉగ్రరూపం.. బ్యాటింగ్ కింగ్గా మారిన క్షణం!

న్యూఢిల్లీ: సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం(2012 ఫిబ్రవరి 28) ఇదే రోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ( 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 133 నాటౌట్) తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. 2012 కామన్ వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ క్షణమే ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ కింగ్గా అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ప్రత్యర్థి నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని పిండి చేసి తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటికే 81 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో 3100 పరుగులు చేసినా.. ఈ ఇన్నింగ్స్తోనే అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

కొండంత లక్ష్యం..
నాటి మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దిల్షాన్(165 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 160), సంగక్కర( 87 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగడంతో ఆ జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 320 పరుగులు సాధించింది. అనంతరం వర్షం కురవడంతో భారత్ లక్ష్యాన్ని 40 ఓవర్లకే కుదించారు. దాంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించాలంటే అద్భుతం జరగాలని అంతా భావించారు. కానీ, ఆ అద్భుతం పేరే విరాట్ కోహ్లీ అని తర్వాత నిరూపితమైంది.

మంచి ఆరంభంతో..
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(30), సచిన్ టెండూల్కర్(39) శుభారంభం అందించారు. ఇద్దరూ 6 ఓవర్లకే జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. దాంతో పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అనువైన మార్గం కల్పించారు. అయితే, సెహ్వాగ్ ఏడో ఓవర్లో ఔటైన కాసేపటికే.. సచిన్ సైతం పెవిలియన్ చేరాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 10 ఓవర్లకు 86/2గా నమోదైంది. తర్వాత జోడీ కట్టిన గంభీర్( 64 బంతుల్లో 4 ఫోర్లతో 63), విరాట్ కోహ్లీ ( 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 133 నాటౌట్) మూడో వికెట్కు శతక భాగస్వామ్యం నిర్మించారు. వీరు మొదట నెమ్మదిగా ఆడినా తర్వాత విజృంభించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 201 వద్ద గౌతీ రనౌటయ్యాడు. అప్పటికి భారత్ 13 ఓవర్లలో 120 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రైనా సాయంతో..
గంభీర్ ఔటయ్యాక టీమిండియాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సాధించాల్సిన రన్రేట్ కూడా ఎక్కువైంది. దాంతో సురేశ్ రైనా ( 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్)తో కలిసి బ్యాటింగ్ చేసిన విరాట్.. లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. మలింగ, కులశేఖర, పర్వేజ్ మహరూఫ్, తిసారా పెరీరా ఎవరినీ వదలకుండ బౌండరీలు బాదాడు. దాంతో ఓవర్కు 10 పరుగుల చొప్పున స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కోహ్లీ తనలోని క్లాస్ బ్యాటింగ్ను పరిచయం చేశాడు. ఎక్కడా భారీ షాట్లకు పోకుండా చూడముచ్చటైన కవర్ డ్రైవ్ షాట్లతో అలరించాడు. అసాధ్యం అనుకున్న కొండంత లక్ష్యాన్ని సుసాధ్యం చేశాడు. చివరికి 36.4 ఓవర్లలోనే విజయాన్నందించాడు.

మలింగాకు చుక్కలే..
యార్కర్ల కింగ్, వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన లసిత్ మలింగా బౌలింగ్ను విరాట్ చీల్చిచెండాడాడు. అతను వేసిన 35 ఓవర్లలో 2, 6, 4, 4, 4, 4 నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆ ఇన్నింగ్స్తోనే ప్రత్యర్థులందరికి హెచ్చరికలు జారీచేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దశబ్దకాలం తనదైన బ్యాటింగ్తో చెలరేగాడు. ఎన్నో చిరస్మరణీ ఇన్నింగ్స్లతో అద్భుత విజయాలందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications