
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనను ఇంటర్వ్యూ పేరుతో ఇంటికి తీసుకెళ్లాడని, ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడని అతని సతీమణి అంజలి తెలిపింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరి వివాహ బంధానికి సోమవారంతో 26 వసంతాలు పూర్తయ్యాయి. 1995 మే 24న ఈ జంట ఒక్కటైంది. అయితే, సచిన్తో ఏర్పడిన మొదటి పరిచయం, ఏ అబద్ధం చెప్పి సచిన్.. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడనే విషయాలను అంజలి సచిన్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'ఆవిష్కరణ సమయంలో గుర్తుచేసుకున్నారు. వారి మ్యారెజ్ డే సందర్భంగా ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేశాయి.
'నన్ను సచిన్ను తొలిసారి చూసినప్పుడు అతనికి 17 ఏళ్లు. ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని విమానాశ్రయం చేరుకున్నాడు. అదే సమయంలో మా అమ్మను రిసీవ్ చేసుకోవడానికి నేను అక్కడికి వెళ్లాను. ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకున్నాం. నన్ను చూసిన మరుక్షణమే పెళ్లి చేసుకోవాలని సచిన్ అనుకున్నాడట. కానీ, సచిన్ ఎవరు? ఏం చేస్తాడనే విషయాలు నాకప్పటికి తెలీదు. కొంతకాలం తర్వాత మేం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నాం.
మా పరిచయం బలపడిన తర్వాత అతనితో మాట్లాడటానికి ఇప్పటి మాదిరిగా ఆ కాలంలో మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా లేదు. అందువల్ల అతనితో మాట్లాడటానికి 48 ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని దాటి టెలిఫోన్ బూత్కు వెళ్లేదాన్ని. ఎక్కువ సమయం మాట్లాడటంతో బిల్లు కూడా ఎక్కువగా వచ్చేది. టెలిఫోన్ బిల్లులను ఆదా చేయడానికి ప్రేమ లేఖలతో సంభాషించుకునేవాళ్లం. జర్నలిస్టుగా నటించాలని, అలా నన్ను వారి కుటుంబసభ్యులకు పరిచయం చేస్తానని చెప్పాడు. తనను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్న జర్నలిస్టుగా నన్ను సచిన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ సమయంలో సచిన్ కాస్త భయపడ్డాడు. సల్వార్ కమీజ్ ధరించి మొదటిసారి ఆయన ఇంటికి వెళ్లా' అని అంజలి చెప్పుకొచ్చారు.