
అందరికీ ధన్యవాదాలు..
‘అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెబుతున్నా. 18 ఏళ్ల నా క్రికెట్ ప్రయాణాన్ని నేటితో ముగిస్తున్నా. నా కెరీర్లో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 17 ఏళ్ల వయసులో నాపై విశ్వాసాన్ని ఉంచి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. కెరీర్లో మార్గదర్శకం చేస్తూ అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు.' అని పార్థివ్ పేర్కొన్నాడు. ఇక 2002లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే పార్థివ్ పటేల్ ఇంగ్లండ్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తద్వారా టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయసు( 17 సంవత్సరాల 153 రోజులు) ఆటగాడిగా పార్థివ్ అప్పట్లో రికార్డు సృష్టించాడు.

బక్రా అయిన పార్దీవ్..
ఇక పార్థీవ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. కెరీర్ ప్రారంభంలో పార్థీవ్ను ఓ టీవీ షో బక్రా చేసింది. 2003లో జరిగిన ఈ ఘటన ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంది. ప్రాంక్లో భాగంగా ఓ ట్యాక్సీ ఎక్కిన పార్దీవ్ను డ్రైవర్ తనకు చాతిలో నొప్పిగా ఉందని, డ్రైవింగ్ చేయలేనని ఆసుపత్రికి తీసుకెళ్లమంటాడు. ఆపదలో ఉన్నవాడిన ఆదుకోవాలనే ఉద్దేశంతో ట్యాక్సీని నడిపిన పార్థీవ్ను పోలీసులు అడ్డుకుంటారు. లైసెన్స్ చూపించమని, 18 ఏళ్లు లేకుండా ఎలా నడుపుతావని నిలదీస్తారు. అప్పటికే అతని 18 ఏళ్లు పూర్తయి లైసెన్స్ ఉన్నా.. అది ఫేక్ అంటూ భయబ్రాంతులకు గురి చేస్తారు. పార్థీవ్ క్షమాపణలు చెప్పేవరకు వదిలిపెట్టారు. చివరకు ఇది ప్రాంక్ అని చెప్పడంతో పార్థీవ్ ఊపిరి పీల్చుకుంటాడు. అప్పట్లో ఈ వీడియో ఆ టీవీ షోకు విపరీతమైన క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఈ ప్రాంక్పై అభిమానులు రెండుగా చీలిపోయారు. కొందరూ షోను సమర్ధించగా.. మరికొందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచిన్ తరహాలోనే..
ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరహాలోనే పాల బుగ్గల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన పార్ధీవ్ ఆరంభంలో ఆకట్టుకున్నాడు. తనదైన ఆటతో సచిన్ అంతటి వాడైతాడనే నమ్మకాన్ని కలిగించాడు. కానీ ఆ తర్వాత దూకుడు కోనసాగించలేక జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాకుండా తన స్థానాన్ని ధోనీ భర్తీ చేయడంతో పార్థీవ్కు మళ్లీ అవకాశం దక్కలేదు. భారత్ తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడిన పార్థీవ్... శ్రీలంకతో 2012లో చివరి వన్డే, 2018లో సౌతాఫ్రికాతో ఆఖరి టెస్ట్ ఆడాడు.

ఈ సీజన్లో చాన్స్ రాలేదు..
35 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ పార్థివ్.. టెస్టుల్లో 934, వన్డేల్లో 1696 పరుగులు చేశాడు. ఐపీఎల్లో మొత్తం ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన పార్దీవ్.. ఓపెనర్గా మెరుపు ఇన్నింగ్స్లు ఆడి లీగ్లో 2848 పరుగులు చేశాడు. 13వ సీజన్లో బెంగళూరు జట్టులో ఉన్న పార్థివ్కు ఒక్క మ్యాచ్లోనూ అవకాశం రాలేదు. గత 13 సీజన్లలో అతను ముంబై, చెన్నై, బెంగళూరు, డెక్కన్ చార్జర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక దేశవాళీ క్రికెట్లోనూ పార్థివ్ సత్తాచాటాడు. 194 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 11,240 పరుగులు చేశాడు. దీనిలో 27 శతకాలు ఉన్నాయి. గుజరాత్ కెప్టెన్గా 2016-17 రంజీట్రోఫీని అందించాడు.


Click it and Unblock the Notifications












