ధోనీ కోసం పోటీపడ్డ ముంబై..
2007 టీ20 ప్రపంచకప్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టును తనదైన మార్క్ కెప్టెన్సీతో ధోనీ విశ్వవిజేతగా నిలిపాడు. దాంతో మహీ అందరి దృష్టి ఆకర్షించడంతో పాటు ఓవర్నైట్ స్టార్గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2008 సీజన్ కోసం జరిగిన వేలంలో మహీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు లీగ్ నిబంధనల కారణంగా ముంబై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. లేకుంటే ధోనీ ముంబై జట్టుకే ఆడేవాడు. అప్పుడు సీఎస్కే అభిమానుల తాలా ఉండేవాడు కాదు.
రూ. 10 కోట్లు పలికిన ధోనీ..
వేలంలో ముంబై- చెన్నై మధ్య నెలకొన్న పోటీతో ధోనీ పంట పడింది. ఆరంభ సీజన్లోనే అతను ఏకంగా రూ.10 కోట్లుకు పైగా పలికాడు. ఆ సీజన్లో ఇదే హయ్యెస్ట్. వాస్తవానికి ముంబై ఇండియన్స్కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రూపంలో స్టార్ ఆటగాడున్నాడు. కానీ చెన్నైకి ఏ స్టార్ ప్లేయర్ లేకపోవడంతో ధోనీ కోసం ఏందాకైనా సరే అన్న రీతిలో వేలంలో పాల్గొంది. చివరకు 1.5 మిలియన్ల అమెరికా డాలర్ల(రూ. 10 కోట్లకు పైగా)కు మహీని సొంతం చేసుకుంది. మరోవైపు సచిన్ టెండూల్కర్ కారణంగా ముంబై ఇండియన్స్ పోటీలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఆ జట్టు సచిన్ కోసం భారీ ధరను వెచ్చించింది. దాంతో కనీస ధర అనే రూల్స్ అడ్డురావడంతో వెనక్కి తగ్గింది.
సచిన్ కారణంగా..
జట్టు పర్స్ మొత్తం 5 మిలియన్ల అమెరికా డాలర్లే ఉండటం.. అందులో ఐకాన్ ప్లేయర్లకు 15 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయవద్దనే నిబంధన ఉండటం.. ముంబై ప్రయత్నాలకు ఆటంకం కలిగించాయి. సచిన్, ధోనీలకే భారీ మొత్తం ఖర్చు చేస్తే ఇతర ఆటగాళ్లను కొనలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండటంతో ముంబై ధోనీని వదులుకోక తప్పలేదు. కానీ చెన్నైకి స్టార్ ప్లేయర్ లేకపోవడంతో ధోనీ కోసం ఎంతైనా ఖర్చు చేసే వెసులుబాటు కలిగింది. దాంతో ఈ స్టార్ కూల్ కెప్టెన్ను అరవం జట్టు దక్కించుకుంది.
సక్సెస్ఫుల్ కెప్టెన్..
ఇక ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ గెలుచుకుంది. గత సీజన్ మినహా ప్రతీ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. 197 మ్యాచ్ల్లో 119 విజయాలందుకుంది. ఐపీఎల్లో 100 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్ మహీ. కరోనాతో ఆగిపోయిన తాజా సీజన్లోనూ సీఎస్కే దుమ్మురేపింది. 7 మ్యాచ్ల్లో 5 గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. అయితే మహీ వచ్చే సీజన్ ఆడటంపై అనుమానులు నెలకొన్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ను 2008-2011 వరకు నడిపించిన సచిన్ ఒక్క టైటిల్ అందుకోలేకపోయాడు. 2010లో ఫైనల్కు చేర్చినప్పటికీ ధోనీ సేన చేతులో ఆ జట్టుకు భంగపాటు తప్పలేదు.