న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మైదానంలో అతను దూకుడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యేవారు. 99,.. 199, 299 అయినా ఏ మాత్రం జంకకుండా సిక్స్ కొట్టగలిగే ఏకైక క్రికెటర్ సెహ్వాగ్. బంతి బాదడమే తన లక్ష్యంగా బరిలోకి దిగేవాడు. తనదైన షాట్లతో అభిమానులను అలరించేవాడు. అందుకే అతనంటే ఇప్పటికీ అంతా ఇష్టపడుతుంటారు.
క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత సెహ్వాగ్.. సోషల్ మీడియా వేదికగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తనదైన ట్వీట్లు, సెటైరిక్ పోస్ట్లతో అభిమానుల్ని అలరిస్తున్నాడు. ప్రతీ విషయంపై స్పందిస్తూ.. ప్రతి పోస్ట్లో హాస్య చతురతను జోడీస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. అయితే సెహ్వాగ్ తన గురించి ఎవరికీ పెద్దగా తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
పాటలు పాడుతూ బ్యాటింగ్ చేసేవాడినని, తన పాటలకు ఫిదా అయిన పాక్ కెప్టెన్ కమ్రాన్ అక్మల్ తనకు ఇష్టమైన పాట అడిగి మరి పాడించుకున్నాడని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
ఇటీవల సౌరవ్ గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'దాదాగిరి' షోలో సెహ్వాగ్ గత జ్క్షాపకాల్ని నెమరవేసుకున్నాడు. ప్రధానంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో భాగంగా ముల్తాన్ టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించినప్పడు, బెంగళూరులో 201 పరుగులు చేసినప్పుడు, లాహోర్లో 154 పరుగులు చేసిన సందర్భాల్లో హిందీ పాటలు పాడుతూనే బ్యాటింగ్ చేసిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో కమ్రాన్ అక్మల్ వికెట్ల వెనకాల ఉంటూ తన పాటల్ని ఆస్వాదించేవాడన్నాడు. ఒకానొక సందర్భంలో భారత లెజెండ్ సింగర్ కిషోర్ కుమార్ పాడిన పాటను అక్మల్ ప్రత్యేకంగా అడిగి మరీ పాడించుకున్నాడన్నాడని తెలిపాడు.
సెహ్వాగ్ పాట పాడుతూ దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ అలెన్ డొనాల్డ్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన విషయాన్ని గంగూలీ గుర్తుచేశాడు. 2015లో ఆల్ స్టార్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో డొనాల్డ్ లెగ్ సైడ్ వేసిన బంతిని సిక్స్గా కొట్టినప్పుడు సెహ్వాగ్ ఒక పాట పాడుకుంటూ ఉన్నాడన్నాడు. పాకిస్తాన్ ప్లేబ్యాక్ సింగర్ అతిఫ్ ఆస్లామ్ సాంగ్ అయిన 'తు జానా నా' పాటను సెహ్వాగ్ అప్పుడు పాడుతున్నాడని గంగూలీ తెరపై చూపించి మరీ వినిపించాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట హల్చల్ చేస్తోంది.