టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు 15 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ మోకాలితో పాటు వీపుకు, నొసలుకు పలు సర్జరీలు జరిగాయి.
ఈ గాయాల నుంచి పూర్తిగా కోలుకొని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ అసాధారణ ప్రదర్శనతో మునపటిలా సత్తా చాటుతున్నాడు. 2022 డిసెంబర్ 30 రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్త ఏడాది తన కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పంత్.. ఢిల్లీ నుంచి తన సొంత బీఎండబ్ల్యూ కారులో రూర్కీ బయల్దేరాడు. నిద్రమత్తులో టర్నింగ్ వద్ద డివైడర్ను ఢీకొట్టాడు.

దాంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ కారులోనే ఇరుక్కుపోయిన పంత్ను.. అక్కడి స్థానికులు రజత్, నిషూలు కాపాడారు. కారులో నుంచి బయటకు తీసి అంబులెన్స్కు ఫోన్ చేశారు. తనను ప్రాణాలతో రక్షించి పునర్జన్మను ప్రసాదించిన ఈ ఇద్దరికి పంత్.. సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.
వారి ధైర్యానికి సెల్యూట్ చేశాడు. అంతటితో కాకుండా ఈ ఇద్దరికీ హోండా స్కూటీలను కొనిచ్చాడు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు వ్యక్తులే ఓ ఛానల్కు తెలిపారు. ఆ రెండు స్కూటర్లపై పంత్ అని పేరు రాసి ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రిషభ్ పంత్.. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 37 పరుగులతో రాణించాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఏడో వికెట్కు 48 పరుగులు జోడించాడు.
ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అసాధారణ బ్యాటింగ్తో చెలరేగారు.
దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. అంతకుముందు 67/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాటర్లు మిచెల్ స్టార్క్(112 బంతుల్లో 2 ఫోర్లతో 26), అలెక్స్ క్యారీ(31 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో బుమ్రా(5/30) ఐదు వికెట్లు తీయగా.. అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/48) మూడు వికెట్లు.. మహమ్మద్ సిరాజ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లతు, సిక్స్తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 37), కేఎల్ రాహుల్(74 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
Rishabh Pant gifted two wheeler vehicle to Rajat and Nishu ❤️
— Naman (@Im_naman__) November 23, 2024
Thank you Rajat and Nishu ( They were the first responders on that horrific day ). We are indebted to you.#RishabhPant pic.twitter.com/Zb3Haj75zF