న్యూజిలాండ్తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. అసాధారణ ప్రదర్శనతో భారత జట్టును ఆదుకున్నాడు. 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కైల్ జెమీసన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ వెంటనే గట్టిగా ఈల వేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం అతని ఈల సెలెబ్రేషన్స్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
రాహుల్ ఇలా ఈల వేస్తూ సెంచరీని సెలెబ్రేట్ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో టెస్ట్ల్లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇలానే సంబరాలు జరుపుకున్నాడు. తన ముద్దుల తనయ ఎవారా కోసమే రాహుల్ ఇలా ఈల వేస్తూ సంబరాలు చేసుకుంటాడు. ఆమె పుట్టకముందు కళ్లు, చేవులు మూసుకొని సైలెన్స్ అనే రితీలో సంబరాలు చేసుకునేవాడు. కానీ కూతురు పుట్టినప్పటి నుంచి తన సెలెబ్రేషన్ స్టైల్ను మార్చుకున్నాడు.

రాహుల్ సెంచరీతో ఈ మ్యాచ్లో భారత్ 284 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ నిరాశపర్చగా.. కేఎల్ రాహుల్( 92 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 112 నాటౌట్) అజేయ శతకంతో భారత జట్టును ఆదుకున్నాడు. 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రాహుల్ ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్కు 73 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డితో ఆరో వికెట్కు 57 రన్స్, సిరాజ్తో కలిసి ఏడో వికెట్కు 28 పరుగులు జోడించాడు. 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన రాహుల్.. మరో 30 (82) బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
రాహుల్కు ఇది 8వ వన్డే సెంచరీ. రాజ్కోట్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోర్ కూడా రాహుల్దే. ఈ క్రమంలో అతను 11 ఏళ్ల రికార్డ్ను బద్దలు కొట్టాడు. 2015లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మైదానంలో 108 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇదే హయ్యెస్ట్ వన్డే వ్యక్తిగత స్కోర్గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్తో రాహుల్ అధిగమించాడు. ఈ మైదానంలో కేఎల్ రాహుల్(112 నాటౌట్), క్వింటన్ డికాక్(108), స్టీవ్ స్మిత్(98), శిఖర్ ధావన్(96), మిచెల్ మార్ష్(96) టాప్-5 స్కోరర్లుగా కొనసాగుతున్నారు.