టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో సహా పలువురు ఆటగాళ్లు బీసీసీఐ పెట్టిన ఫిట్నెస్ పరీక్షలు నెగ్గారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఈ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లు ఈ ఫిట్నెస్ టెస్ట్ పాసయ్యారు.
ఈ ఫిట్నెస్ టెస్ట్ల్లో బీసీసీఐ.. యో యో టెస్ట్ కాకుండా.. కొత్తగా బ్రోంకో టెస్ట్ కూడా చేసింది. దాంతో బ్రోంకో టెస్ట్ అనే పదం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఈ బ్రోంకో పరీక్ష గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
బ్రోంకో టెస్ట్ ఒక రకమైన హై-ఇంటెన్సిటీ రన్నింగ్ డ్రిల్ అని చెప్పొచ్చు. ఈ పరీక్షను సాధారణంగా రగ్బీ, ఫుట్బాల్ ఆటగాళ్లకు ఉపయోగిస్తారు. ఆటగాళ్ల ఏరోబిక్ ఎండ్యూరెన్స్ , వేగం, అలసట నుంచి త్వరగా కోలుకునే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ టెస్ట్ను పెడుతారు.ఇది యో-యో టెస్ట్ కంటే చాలా కఠినంగా ఉంటుంది. మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం పరిగెత్తాల్సి ఉంటుంది.

బ్రోంకో టెస్ట్ ఒక నిర్దిష్ట పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు. ముందుగా 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరంలో మార్కర్లను ఏర్పాటు చేస్తారు. ఆటగాడు స్టార్టింగ్ లైన్ నుంచి పరుగెత్తడం ప్రారంభించాలి. తొలుత 20 మీటర్ల మార్కర్ వద్దకు పరుగెత్తి తిరిగి స్టార్టింగ్ లైన్కు రావాలి. ఆ తర్వాత 40 మీటర్ల మార్కర్ వద్దకు పరుగెత్తి మళ్లీ స్టార్టింగ్ లైన్కు రావాలి. చివరగా 60 మీటర్ల మార్కర్ వద్దకు పరుగెత్తి తిరిగి స్టార్టింగ్ లైన్కు రావాలి. ఇలా ఆగకుండా పరుగెత్తితే ఒక సెట్ అవుతుంది. ఒక్క సెట్లో మొత్తం 240 మీటర్ల కవర్ అవుతుంది. ఇలా ఆగకుండా ఐదు సెట్స్ పూర్తి చేయాలి. అంటే 1200 మీటర్ల దూరం పరుగెత్తాలి. ఇందుకు పట్టిన సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఎలైట్ అథ్లెట్స్ సాధారణంగా 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే దీన్ని పూర్తి చేస్తారు.
భారత ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలను పెంచే లక్ష్యంతో బీసీసీఐ ఈ బ్రోంకో టెస్ట్ను ప్రవేశపెట్టింది. గతంలో యో-యో టెస్ట్ ప్రధానంగా ఉండేది. కానీ ఇప్పుడు యో-యోతో పాటు బ్రోంకో టెస్ట్ను కూడా తప్పనిసారి చేశారు. ఆటగాళ్ల ఎండ్యూరెన్స్ మెరుగుపర్చడం, వేగం, రికవరీ సామర్థ్యం అంచనా వేసేందుకు ఈ టెస్ట్ను ఉపయోగిస్తారు. యో యో టెస్ట్కు ఇది ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. అదనపు పరీక్ష. క్రికెట్ మ్యాచ్ల్లో ఆటగాళ్లు బంతిని కోసం పరుగెత్తడం, వికెట్ల మధ్య పరుగెత్తడం, ఫీల్డింగ్ చేయడం వంటివి నిరంతరం చేయాల్సి ఉంటుంది. బ్రోంకో టెస్ట్ ఈ నిరంతర శారీరక శ్రమకు ఆటగాళ్లను సిద్ధం చేస్తుంది.
టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగే మూడు వన్డేల సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత ఇంటికే పరిమితమైన రోహిత్.. ఈ సమయంలో ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఈ క్రమంలోనే అతనికి బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్లు నిర్వహించింది. ఇంగ్లండ్ పర్యటన అనంతరం శుభ్మన్ గిల్ జ్వరంతో బాధపడటంతో అతను కూడా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ ఫిట్నెస్ టెస్ట్లకు విరాట్ కోహ్లీ మాత్రం దూరంగా ఉన్నాడు.