ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వెటరన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడంపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న అయ్యర్ను ఎంపిక చేయకపోవడం వింతగా అనిపించిందన్నాడు. అతని వేటు వెనుక క్రికెటేతర కారణాలు ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశాడు. తెరవెనుక ఏదో కుట్ర జరుగుతోందన్నాడు. ఎక్స్ వేదికగా అభిమానులతో జరిపిన ఇంటరాక్షన్లో డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'నిజాయితీగా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ను తప్పించడం వెనుక ఉన్న కారణాలు నాకు కూడా తెలియదు. కేవలం ఊహిస్తున్నాను. శ్రేయస్ అయ్యర్ వంటి నాణ్యమైన ఆటగాడు, ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉన్న ప్లేయర్ను పక్కనపెట్టడం నాకు వింతగా అనిపించింది. బహుషా ఎక్కువ మంది నాయకులు ఉన్నారని పక్కన పెట్టి ఉండొచ్చు. కొన్నిసార్లు ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఎంపిక సంక్లిష్టంగా ఉన్నప్పుడు.. జట్టు వాతావరణానికి ఎవరు ఎక్కువ మేలు చేస్తారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

శ్రేయస్ అయ్యర్ చాలా పరిణతి చెందాడు. అతనిలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కానీ తెరవెనుక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఈ విషయం శ్రేయస్కు కూడా తెలియకపోవచ్చు. క్రికెటేతర కారణాలు అతని ఉద్వాసనకు కారణం కావచ్చు. అతను నాణ్యమైన ఆటగాడే. నేనైతే కచ్చితంగా ఎంపిక చేసేవాడిని. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఎంపిక సంక్లిష్టంగా మారితే.. జట్టు దృక్పథం నుంచి ఆలోచించి ఎంపిక చేస్తా. సదరు ఆటగాడి చేరికతో జట్టుకు అదనపు విలువ చేకూరుతోందా? అనేది చూసి ఎంపిక చేస్తా. జట్టులో ఉత్సాహాన్ని నింపే ఆటగాడా లేక నీరుగార్చేవాడా? అని చూస్తా.
బహుశా శ్రేయస్ అయ్యర్ వెనుక కూడా అలాంటి కారణమేదైనా ఉందేమో!. అంతేకాకుండా, "జట్టులో ఇప్పటికే నాయకులు ఎక్కువయ్యారా? ఎక్కువ మంది కెప్టెన్లు ఉండటం సమస్యగా మారుతుందని భావించారేమో. అయ్యర్ లాంటి నాణ్యమైన ఆటగాడు జట్టులో లేకపోవడం వింతగా ఉంది. అభిమానులు, నిపుణులు ఈ విషయంపై ప్రశ్నలు అడగాలి. ఏదో ఒకరోజు అసలు నిజం బయటకు వస్తుంది' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.