మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. మరికాసేపట్లో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరగనున్న సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో హర్మన్ప్రీత్ కౌర్ సేన తలపడనుంది. ఈ చావో రేవో మ్యాచ్లో విజయం సాధిస్తేనే టీమిండియా ప్రపంచకప్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడాలంటే టీమిండియా ఈ గండం గట్టెక్కాలి.
లీగ్ దశలో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. కానీ పేలవ బౌలింగ్ కారణంగా 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమికి తలవంచింది. సెమీఫైనల్లో కూడా టీమిండియా అదే స్థాయిలో గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటం భారత ఆటగాళ్లతో పాటు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

నవీముంబైలో ప్రస్తుతం వర్షం పడటం లేదు. కానీ ఆకాశం మేఘావృతమై ఉంది. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్గా ఉన్నాయి. మరికాసేపట్లో భారీ వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే నవీ ముంబై ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ సమయానికి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే ఈ మ్యాచ్కు శుక్రవారం(అక్టోబర్ 31) రిజర్వ్ డేగా కేటాయించారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే రేపు కూడా భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. నేడు కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. ఆగిపోయిన ఓవర్ల నుంచే రిజర్వ్ డేన ఆటను కొనసాగిస్తారు. ఒక సారి టాస్ వేస్తే.. ఆ మ్యాచ్ను లైవ్గా పరిగణిస్తారు.
రిజర్వ్ డే కూడా మ్యాచ్కు అంతరాయం కలిగిన రద్దయితే మాత్రం టేబుల్ టాపర్గా ఉన్న ఆసీస్ నేరుగా ఫైనల్ చేరుతుంది. మరోవైపు భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ క్రమంలోనే భారత అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరణుడ దేవుడు శాంతించాలని, భారత్ ఫైనల్ చేరాలని పూజలు చేస్తున్నారు. మహిళల వన్డే ప్రపంచకప్ టీమిండియాకు అందని ద్రాక్షగా ఉంది. గతంలో తృటిలో టీమిండియా టైటిల్ చేజార్చుకుంది. బుధవారం ఇంగ్లండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా విజయం సాధించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.