ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. జింబాబ్వేతో గురువారం జరిగిన సూపర్-8 మ్యాచ్లో 72 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో మూడు వికెట్లతో సత్తా చాటిన అర్ష్దీప్ సింగ్ మ్యాచ్ అనంతరం ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.
జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తాను వెస్టిండీస్, సౌతాఫ్రికా మ్యాచ్ను తన తండ్రితో కలిసి చూసినట్లు తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టిన ప్రతిసారీ తన తండ్రి సౌతాఫ్రికా బౌలర్లపై అరిచాడని, విండీస్ బ్యాటర్లను శపించాడని వివరించాడు.
'హోటల్ రూమ్లో మా కుటుంబంతో కలిసి వెస్టిండీస్, సౌతాఫ్రికా మ్యాచ్ చూశాను. విండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టిన ప్రతీసారి మా నాన్న వారిపై అరవడం మొదలుపెట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లను బండ బూతులు తిట్టాడు. నేను ఆయన్ని శాంతింపజేశాను. కేవలం క్రికెట్ను చూస్తూ ఆస్వాదించమని, సౌతాఫ్రికా గెలవాలని ప్రార్థించండి'అని అన్నానని అర్ష్దీప్ సింగ్ పేర్కొన్నాడు.
అయితే సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి తమ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చిందని తెలిపాడు. అందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నాడు. ఫైనల్లో సౌతాఫ్రికాతో ఆడాల్సి వస్తే మాత్రం వారిని కచ్చితంగా ఓడిస్తామన్నాడు.

తిలక్ వర్మ కూడా సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ చూసినట్లు తెలిపాడు. 'మేమంతా ఆ మ్యాచ్ చూశాం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో వెస్టిండీస్ చేసిన పరుగులు సరిపోవని మాకు తెలుసు. సౌతాఫ్రికా జట్టు ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో ఈజీగా లక్ష్యాన్ని ఛేదిస్తారని మేం ముందే ఊహించాం.'అని తిలక్ తెలిపాడు.
హార్దిక్ పాండ్యా సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. 'సౌతాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్పై మేమంతా ఓ కన్నేసాం. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాతే జింబాబ్వేతో మ్యాచ్పై పూర్తి ఫోకస్ పెట్టాం. సంక్షోభాన్ని అధిగమించడం, మా నైపుణ్యాలను ప్రదర్శించడంపై మాత్రమే మేం దృష్టి సారించాం'అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
సెమీఫైనల్ రేసులో టీమిండియా నిలవాలంటే వెస్టిండీస్పై సౌతాఫ్రికా గెలవడం కీలకంగా మారింది. దాంతో యావత్ భారత్ సౌతాఫ్రికా గెలవాలని కోరుకుంది. ఆ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో రన్రేట్ లెక్కలతో సంబంధం లేకుండా పోయింది. వెస్టిండీస్తో ఆఖరి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే సెమీస్ చేరనుంది. ఈ మ్యాచ్ రద్దయినా.. ఓడినా భారత్ పోరాటం ముగుస్తుంది.