టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్గా అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అతను బరిలోకి దిగడాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్తో సహా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
కంకషన్ సబ్స్టిట్యూట్ అరంగేట్రం..
అయితే ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్గా టీ20ల్లోకి అరంగేట్రం చేసి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. మూడు కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. శివమ్ దూబే కంకషన్ గాయానికి గురవ్వడంతో అతని స్థానంలో బరిలోకి దిగాడు. భారత బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బౌన్సర్ శివమ్ దూబే హెల్మెట్కు బలంగా తాకింది. రూల్స్ ప్రకారం ఫిజియోలు వచ్చి అతన్ని పరీక్షించారు. బాగానే ఉందని చెప్పిన శివమ్ దూబే బ్యాటింగ్ కూడా కొనసాగించాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అతను ఫీల్డింగ్ చేయలేదు.

ఇది అన్యాయం..
రెండు ఓవర్ల తర్వాత అతని స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు. 3 వికెట్లు తీయడంతో పాటు జోస్ బట్లర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే ఇది రూల్స్కు విరుద్దమని, అన్యాయమని జోస్ బట్లర్ అసహనం వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణా శివమ్ దూబేకు సరిపోలే ఆటగాడు ఏ మాత్రం కాదని మండిపడ్డాడు. ఈ నిర్ణయం తమ విజయాన్ని ప్రభావితం చేసిందన్నాడు. ఈ క్రమంలోనే కంకషన్ సబ్స్టిట్యూషన్ రూల్ తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఈ రూల్ ఏంటో తెలుసుకుందాం.
కంకషన్ రూల్ ఏంటంటే..?
క్రికెట్లో ప్రమాదాలు తగ్గించడానికి, ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం వంటి ఉదంతాలు పునరావృతం కావద్దనే ఉద్దేశంతో ఐసీసీ ఈ కంకషన్ రూల్ తీసుకొచ్చింది. బ్యాటర్ హెల్మెట్, తల, మెడ భాగంలో బంతి తాకినప్పుడు తప్పనిసరిగా ఫిజియోలు వచ్చి పరిశీలించాలనే నియమం పెట్టింది. అంతేకాకుండా కంకషన్ గాయానికి గురైన ప్లేయర్ ఆడలేని పరిస్థితి ఉంటే సబ్స్టిట్యూట్గా మరొకరిని తుది జట్టులోకి తీసుకునే వెసులుబాటు కల్పించింది.
ఐసీసీ నియమం 1.2.7.3 ప్రకారం కంకషన్ సబ్స్టిట్యూట్గా సరిపోలే ఆటగాడిని బరిలోకి దించవచ్చు. అయితే ఈ అభ్యర్థనను మ్యాచ్ రిఫరీ ఆమోదించాలి. ఈ నిర్ణయం కారణంగా కంకషన్ రిప్లేస్మెంట్ చేసే జట్టుకు ఎక్కువ ప్రయోజనం చేకూరకూడదు. అంటే బ్యాటర్ స్థానంలో బ్యాటర్, బౌలర్ స్థానంలో బౌలరే, ఆల్రౌండర్ స్థానంలో ఆల్రౌండనే ఆడించాలి.
మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం..
అయితే ఐసీసీ రూల్ 1.2.7.7 ప్రకారం కంకషన్ సబ్స్టిట్యూషన్పై మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేసే అవకాశం ప్రత్యర్థి జట్టుకు ఉండదు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్.. శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రాణా ఆల్రౌండర్గా పరిగణించి కంకషన్ సబ్స్టిట్యూషన్కు అనుమతించాడు. అయితే ఈ ఇద్దరూ సరిపోలే ఆటగాళ్లు కాదని ఈ ప్రపంచానికి మొత్తం తెలుసని, ఇది అన్యాయమని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.
టీమిండియా కంకషన్ సబ్స్టిట్యూట్ను వాడుకోవడం ఇదే తొలిసారి కాదు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో జడేజా స్థానంలో చాహల్ను కంకషన్ సబ్స్టిట్యూషన్గా బరిలోకి దించింది. ఆ మ్యాచ్లో చాహల్ 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.