
పోర్ట్ఆఫ్ స్పెయిన్: భారత్తో తొలి వన్డేలో గెలవాల్సిన పరిస్థితుల్లో ఓటమిపాలయ్యామని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అన్నాడు. తమ జట్టు సమష్టిగా రాణించినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని తెలిపాడు. శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ 3 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యం నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన నికోలస్ పూరన్.. చివర్లో ప్రణాళిక తగ్గట్లు బ్యాటింగ్ చేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని తెలిపాడు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, తదుపరి మ్యాచ్ల్లో సత్తా చాటడానికి కావాల్సి ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పాడు.
'మేం గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఈ ఓటమి కాస్త చేదుగానే ఉంది. కానీ మేం 50 ఓవర్లు బ్యాటింగ్ చేశాం. జట్టులోని ప్రతీ ఒక్కరు తమ సామర్థ్యం మేరకు రాణించారు. మేం ఎప్పుడూ సానుకూలంశాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. కాలక్రమేణా మేం మెరుగుపడగలమనుకుంటున్నా. బ్యాటింగ్ ట్రాక్పై మా బౌలర్లు అదరగొట్టారు. భారత జట్టును అద్భుతంగా కట్టడి చేశాడు. టీమిండియాను 315 పరగుల లోపే కట్టడి చేయాలని మేం అనుకున్నాం. అకీల్, అల్జారీ ప్రతీ ఒక్కరు సత్తా చాటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో రాణించాం. ఇది మా జట్టుకు శుభసూచకం. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోవడం కష్టంగానే ఉన్నా.. దీన్ని మేం తీసుకుంటాం. ఒకరికొకరు అండగా ఉండి డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. మేం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. అయినా సరైన దిశలోనే ప్రయాణిస్తున్నాం'అని పూరన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... శుభ్మన్ గిల్ (53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 64), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీయగా.. అకీల్ హోసిన్, రొమరియో షెఫర్డ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ జట్టులో కైల్ మేయర్స్(68 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 75), బ్రాండన్ కింగ్(66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించినా.. చివర్లో అకీల్ హోసిన్(32 బంతుల్లో 2 ఫోర్లతో 32 నాటౌట్), రొమారియో షెఫర్డ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు.