బ్యాటింగ్ వైఫల్యమే తమ ఘోర పరాజయానికి ప్రధాన కారణమని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ అన్నాడు. తాము 50 పరుగుల భాగస్వామ్యాలను కూడా నెలకొల్పలేకపోయామని, తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయకపోవడం తమ ఓటమిని శాసించిందని చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్ట్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రోస్టన్ చేజ్.. తమ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు.
'టాస్ గెలిచి 160 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ఇది మేం ఆశించిన ప్రదర్శన కాదు. ముఖ్యంగా భారత్లో మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయడంపై ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా బంతి టర్న్ అవుతున్నప్పుడు, పిచ్ పాడవుతూ.. ఆట నాలుగో, ఐదోరోజు వరకు వెళ్తున్న పరిస్థితుల్లో మేం విఫలమవ్వడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ విషయంపై ఫోకస్ పెట్టాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే నిర్ణయం ఏ మాత్రం తప్పుకాదు. వికెట్పై కాస్త తేమ ఉన్నప్పటికీ.. ముందు బ్యాటింగ్ చేయాలని అంతా అనుకున్నారు. కానీ ఇది టెస్ట్ వికెట్, తొలి రోజు ఆటలో తేమ ఉండటం సహజం. కానీ బ్యాటర్లు తమ సత్తాను చాటాలి.

రెండో కొత్త బంతిని ఎంచుకున్న సమయం కూడా తప్పు కాదు. రెండో కొత్త బంతితోనూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయామని భావిస్తున్నా. బ్యాటర్ల టెక్నిక్ను ఇంకాస్త ఎక్కువగా పరీక్షించాల్సింది. వారిని ముందుకు నడిపించేలా ప్రయత్నించాలి. బహుషా స్టంప్స్కు మరింత దగ్గరగా బౌలింగ్ చేయాలి. మా ప్రధాన సమస్య బ్యాటింగ్లోనే ఉంది. మేం కనీసం 50 పరుగుల భాగస్వామ్యాలను కూడా నమోదు చేయలేకపోయాం. క్రికెట్లో బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా భాగస్వామ్యాలు కీలకం. బ్యాటింగ్లో భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తేనే మాకు విజయం దక్కుతుంది.'అని రోస్టన్ ఛేజ్ చెప్పుకొచ్చాడు.
286 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులు కుప్పకూలింది. అలిక్ అథనాజే (74 బంతుల్లో 3 ఫోర్లతో 38), జస్టిన్ గ్రీవ్స్(52 బంతుల్లో 4 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/31) మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/54) నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్(2/23)కు రెండు వికెట్లు.. వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 128 ఓవర్లలో 448/5 పరుగులకు డిక్లెర్ చేసింది. కేఎల్ రాహుల్(197 బంతుల్లో 12 ఫోర్లతో 100), ధ్రువ్ జురెల్(210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 125, రవీంద్ర జడేజా(176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 104 నాటౌట్) సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(100 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.