
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ వరల్డ్లో సక్సెస్ ఫుల్ కెప్టెన్! దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.! ఇలా అతని ఘనతలు, రికార్డులు గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కానీ మహీ గత ఏడాది వన్డే ప్రపంచకప్ సెమీస్ ఓటమి అనంతరం మైదానానికి దూరమైన విషయం తెలిసిందే. తొలుత ఆర్మీలో విధులన్నాడు. ఆ తర్వాత జనవరి వరకు క్రికెట్ గురించి అడగవద్దన్నాడు. తీరా మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్కు మాత్రం సిద్దమయ్యాడు.
కానీ ఇంతలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. అనంతరం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ రద్దయింది. దీంతో మళ్లీ ఐపీఎల్ పట్టాలెక్కింది. ఈ క్రమంలోనే ధోనీ అందరికి ఊహించని షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు సింపుల్గా ఓ ఇన్స్టా పోస్ట్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాడు.
'కెరీర్ అసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ ఆకస్మిక నిర్ణయంతో అతని అభిమానులు నొచ్చుకున్నారు. కానీ ఐపీఎల్ ఆడుతాననే సంకేతాలు ఇవ్వడంతో అందరూ అతని ఆట కోసం ఎదురూ చూడటం మొదలుపెట్టారు. ఇక అతను బరిలోకి దిగే సమయం రానే వచ్చింది.
మరి కొద్ది గంటల్లో మహీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ముంబై ఇండియన్స్తో అబుదాబి వేదికగా జరిగే ఫస్ట్ మ్యాచ్తో ధోనీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు ఏడాది కాలంగా దూరంగా ఉన్న ధోనీ ఆట కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫస్ట్ మ్యాచ్ రాత్రి 7.30కు మొదలవుతుండటంతో అభిమానులు... వాటే కమ్ బ్యాక్ ధోనీ అంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.
'అంతర్జాతీయ క్రికెట్కు 19.29కు వీడ్కోలు పలికిన నీవు.. 19.30కి రీఎంట్రీ ఇవ్వడం బాగుంది. చూడ ముచ్చటగా ఉంది'అనే మీమ్స్, ట్వీట్స్ను షేర్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ధోనీ గురించే చర్చ జరుగుతుంది. #WelcomeBackDhoni యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.