Suryakumar Yadav: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాపై సాధించిన విజయం పట్ల టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే తమ అసలాట అని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీని తడబాటుతో ప్రారంభించినా.. ఈ మ్యాచ్తో సరైన ట్రాక్లోకి వచ్చామని చెప్పాడు.
గ్రూప్-ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ను కొనియాడాడు.

కఠినమైన పిచ్పై ఇషాన్, సంజూ అదిరిపోయే ఆరంభాన్ని అందిస్తే.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారని చెప్పాడు. బౌలింగ్లో వరుణ్ క్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ సత్తా చాటారని తెలిపిన సూర్య.. బుమ్రా రాక జట్టుకు అతిపెద్ద బూస్ట్ అని చెప్పాడు.
'ఇది చాలా మంచి మ్యాచ్. బ్యాటింగ్కు కష్టమైన వికెట్పై ఇషాన్, సంజూ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత రెండు, మూడు వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ.. శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బంతి కొంచెం ఆగుతూ వచ్చింది. బ్యాటింగ్కు కష్టంగా మారింది. నమీబియా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు కసితో ఈ మ్యాచ్ ఆడారు. వారు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. వారి బౌలింగ్కు నేను ఫిదా అయ్యాను. మేం వెనువెంటనే వికెట్లు కోల్పోయాం కానీ.. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. చివర్లోనూ మంచి ముగింపు లభించింది.
బౌలింగ్ విభాగంలో బుమ్రా తన 4 ఓవర్లు పూర్తిగా బౌలింగ్ చేయడం జట్టుకు కలిసొచ్చే అంశం. అతను జట్టులోకి తిరిగిరావడం శుభపరిణామం. తదుపరి మ్యాచ్ కూడా అతను ఆడుతాడు. వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ ద్వయం బౌలింగ్ చేసిన తీరు అమోఘం. వారిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కష్టం. హార్దిక్ పాండ్యా.. కొత్త బంతితోనైనా, పాత బంతితోనైనా బౌలింగ్ చేస్తాడు.
అతను బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం.. క్లిష్ట పరిస్థితుల్లో పాజిటివ్ మైండ్సెట్తో వచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు మా ఆట తీరు పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. తదుపరి మ్యాచ్ల్లో కూడా ఇలానే రాణించాలనుకుంటున్నాం. మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. మేం కొంచెం తడబాటుతో మొదలు పెట్టినప్పటికీ.. ఇప్పుడు మేం సరైన దారిలోకి వచ్చామని అనుకుంటున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.