వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే పాకిస్థాన్తో భారత్ ఆడే విషయంపై సందిగ్దత నెలకొనగా.. తాజాగా ఈ టోర్నీ స్పాన్సర్స్ ఈ మ్యాచ్ నుంచి బహిష్కరించాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఈ మ్యాచ్కు తాము స్పాన్సర్ చేయలేమని ఈజ్ మై ట్రిప్ సంస్థ ప్రకటించింది.
ఆ కంపెనీ కో ఓనర్ నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఉగ్రవాదం, క్రికెట్ ఎప్పటికీ కలిసి ముందుకు సాగలేవు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలను పునరుద్దరించడానికి ప్రయత్నించే ఏ ఈవెంట్కు మేం మద్దతు ఇవ్వం. మా మొదటి ప్రాధాన్యం దేశం. ఆ తర్వాతే వ్యాపారం'అని నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నిశాంత్ పిట్టి నిర్ణయంపై భారత నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే లీగ్ దశలో పాకిస్థాన్తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్తో ఆడలేమని ఆటగాళ్లు చెప్పారు. దాంతో ఈ మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. సెమీస్లో మరోసారి ఈ రెండు జట్లు తలపడాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికే భారత దిగ్గజ ఆటగాడు శిఖర్ ధావన్ పాకిస్థాన్తో ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని స్పష్టం చేశాడు. ఎన్ని సార్లు ఈ ప్రశ్నను అడుగుతారని మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేసాడు. ఎప్పుడైనా.. ఎక్కడైనా తాను పాకిస్థాన్తో ఆడబోనని పేర్కొన్నాడు. తాజాగా స్పాన్సర్ కూడా తప్పుకోవడంతో నిర్వాహకులు సెమీస్ పోరును మారుస్తారా? లేక పాకిస్థాన్ను ఫైనల్ చేర్చుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.
వెస్టిండీస్తో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్కు అర్హత సాధించింది. ఈ టోర్నీ లీగ్ దశలో 5 మ్యాచ్లు ఆడిన భారత్ ఒకే ఒక్క విజయం సాధించింది. కానీ మెరుగైన రన్రేట్తో సెమీస్కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు బరిలోకి దిగగా.. నాలుగేసి విజయాలతో పాకిస్థాన్, సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్లు టాప్-2లో నిలిచాయి. రెండు విజయాలతో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మూడో స్థానంలో నిలవగా.. ఇండియా ఛాంపియన్స్ మెరుగైన రన్రేట్తో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కో విజయం సాధించినా.. తక్కువ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.