వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ పోరాటం ముగిసింది. అసాధారణ ప్రదర్శనతో సెమీఫైనల్కు అర్హత సాధించిన యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్.. టేబుల్ టాపర్ అయిన పాకిస్థాన్తో ఆడేందుకు నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్తో ఆడమని భారత దిగ్గజ ఆటగాళ్లు స్పష్టం చేశారు. దాంతో ఈ మ్యాచ్ను రద్దు చేసిన నిర్వాహకులు పాకిస్థాన్ ఛాంపియన్స్ ఫైనల్కు వెళ్లినట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు.

'ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకొచ్చే శక్తి క్రీడలకు ఉంటుందని మేం ఎప్పుడూ నమ్ముతాం. అయితే ప్రజల సెంటిమెంట్ను గౌరవించడం కూడా ముఖ్యమే. ఏదైనా మేం ప్రేక్షకుల కోసమే చేస్తాం. సెమీఫైనల్ నుంచి తప్పుకున్న ఇండియా ఛాంపియన్స్ నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అదే విధంగా పాకిస్థాన్ ఛాంపియన్స్ పట్ల కూడా మాకు అదే స్థాయి గౌరవం ఉంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ను రద్దు చేశాం. ఫలితంగా పాకిస్థాన్ ఛాంపియన్స్ ఫైనల్కు అర్హత సాధించింది.'అని డబ్ల్యూసీఎల్ తమ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు లీగ్ దశలో పాకిస్థాన్తో మ్యాచ్ రద్దు చేసుకున్న భారత ఆటగాళ్లు.. సెమీస్లో కూడా ఆడమని చెప్పారు. పాక్తో ఫైనల్ ఆడాల్సి వచ్చినా ఈ నిర్ణయమే తీసుకునేవాళ్లమని స్పష్టం చేశారు. తమ దేశం కంటే ఎదీ ముఖ్యం కాదన్నారు. 'మేం పాకిస్థాన్తో ఆడటం లేదు. మాకు ఎప్పుడైనా సరే దేశం ముఖ్యం. దేశం కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం సంకోచించం. భారత జట్టు సభ్యులుగా మేం ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మా దేశ ప్రజలను నిరాశపర్చం. దేశం కోసమే మేం సెమీస్కు చేరుకున్న తర్వాత మ్యాచ్ను రద్దు చేసుకున్నాం. ఒకవేళ ఫైనల్కు చేరి అక్కడ పాక్తో ఆడాల్సి వచ్చినా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మేమంతా ఒకేమాటపై నిలబడతాం.'అని ఇండియా ఛాంపియన్స్లోని ఓ ఆటగాడు తెలిపాడు.
ఇండియా ఛాంపియన్స్ నిర్ణయంతో ఆసియాకప్పై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఆసియా కప్లో పాకిస్థాన్తో భారత్ ఆడుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా భారత సీనియర్ ఆటగాళ్లు పాకిస్థాన్తో మ్యాచ్ రద్దు చేసుకోవడంతో బీసీసీఐ కూడా ఇలానే మ్యాచ్లను బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేశం కంటే ఏది ముఖ్యం కాదని సూచిస్తున్నారు. పాక్తో మ్యాచ్ ఆడకుంటే భారత్కు వచ్చే నష్టం ఏం లేదు, కానీ ఆ జట్టు క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోనుంది.