వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ జట్టు ఓటమిపాలైంది. శనివారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఛాంపియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(60 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 91), పవర్ హిట్టర్ యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రాబిన్ ఊతప్ప(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37) పర్వాలేదనిపించగా.. అంబటి రాయుడు(0) డకౌటయ్యాడు. సురేశ్ రైనా(11), యువరాజ్ సింగ్(3) తీవ్రంగా నిరాశపర్చారు. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ బౌలర్లలో డాన్ క్రిస్టియన్ (2/34) రెండు వికెట్లు తీయగా.. బ్రెట్ లీ, డీ ఆర్సీ షాట్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసి గెలుపొందింది. కాలమ్ ఫెర్గూసన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 70) విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఆసీస్ ఛాంపియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి అండగా డాన్ క్రిస్టియన్(39) రాణించాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా(3/36) మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. వినయ్ కుమార్(1/47) ఒక వికెట్ దక్కింది. ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. వినయ్ కుమార్ డిఫెండ్ చేయలేకపోయాడు.
పాకిస్థాన్తో తొలి మ్యాచ్ను రద్దు చేసుకున్న భారత్.. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ చేతిలో ఓడి పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆదివారం ఇంగ్లండ్ ఛాంపియన్స్తో ఆడనున్న భారత్.. మంగళవారం వెస్టిండీస్తో తలపడనుంది.