వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) 2024 ముగిసి మూడు రోజుల అవుతున్నా.. ఈ టోర్నీకి సంబంధించిన వార్తలు హల్ఛల్ చేస్తున్నాయి. అలనాటి ఆటగాళ్లంతా కలిసి టీ20 ఫార్మాట్లో ఆడిన ఈ టోర్నీ మినీ ప్రపంచకప్ను తలపించింది. తమ ఆరాధ్య ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు వారి ఆటను బాగా ఆస్వాదించారు. దాంతో ఈ టోర్నీ బాగా సక్సెస్ అయ్యింది.
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడటంతో ఈ టోర్నీ స్థాయి రెట్టింపు అయ్యింది. గత ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఛాంపియన్స్ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది.

ఈ మ్యాచ్లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ హై డ్రామాకు తెరలేపాడని ఇండియన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. వ్యూహాత్మకంగా జట్టుకు లాభం చేకూర్చేందుకు మిస్బా ఉల్ హక్ ఇంజ్యూరీ నాటకం ఆడాడని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది.
షోయబ్ మాలిక్(36 బంతుల్లో 41) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత పేసర్ అనురీత్ సింగ్ మూడు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. వినయ్ కుమార్, పవన్ నేగి, హర్భజన్ సింగ్లు తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో 15 బంతుల్లో 18 పరుగులు చేసిన మిస్బా ఉల్ హక్.. డెత్ ఓవర్లలో గాయంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. దాంతో కావాలనే మిస్బా గాయమైనట్లు నటిచాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
బిగ్ హిట్టర్ను బ్యాటింగ్ పంపించేందుకు గాయమైనట్లు నాటకం ఆడాడని, నడవలేకపోతున్నానని చెప్పి రిటైర్డ్ హర్ట్గా క్రీజును వీడాడని కామెంట్ చేస్తున్నారు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఎవరూ కూడా గొప్పగా బ్యాటింగ్ చేయలేదు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంబటి రాయుడు(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. యూసఫ్ పఠాన్(16 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 30) మెరుపులు మెరిపించాడు. గుర్క్రీత్ సింగ్(33 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ విజయానంతరం హర్భజన్ సింగ్తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా బాలీవుడ్ మూవీ 'బ్యాడ్ న్యూస్'లోని తౌబా తౌబా హుక్ స్టెప్ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. ఇందులో వారు నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. అయితే మిస్బా ఉల్ హక్ ఇంజ్యూరీని ఉద్దేశించే యువరాజ్, హర్భజన్ సింగ్ సెటైరికల్గా ఈ వీడియో చేశారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
యువీ, భజ్జీ, రైనా మాత్రం '15 రోజుల లెజెండ్స్ క్రికెట్ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి. శరీరంలో ప్రతీ అవయవం నొప్పిగా ఉంది. ఇది మా వెర్షన్ 'తౌబా తౌబా' అంటూ ఈ వీడియోకు క్యాప్షన్కు రాసుకొచ్చారు. అయితే ఈ వీడియోపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తొలగించి క్షమాపణలు తెలియజేశారు.