
తన రాబోయే పుస్తకానికి సంబంధించి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాకు వచ్చిన స్టీవ్ వా.. ఈడెన్ మైదానంలో సందడి చేశాడు. షూటింగ్ ప్రదేశంలో సహచర కెమెరామెన్లతో కలిసి బెంగాల్-ఢిల్లీ మ్యాచ్ను ఫొటో గ్రాఫర్గా ఆస్వాదించాడు. అనంతరం కోల్కతా ప్రసిద్ధ మైదానం గొస్తో పాల్ వెళ్లాడు. ఇక బ్లాక్ షార్ట్స్ బ్లూ టీ షర్టు ధరించిన వా తొలుత పోలీస్ ఏసీ మైదానం, తరువాత కోలకతా కస్టమ్స్కు వెళ్లి అక్కడ ఫోటోలు తీశాడు.
ఇక ఆదివారం కోల్కతా శివార్లలోని బరాక్పూర్లోని ఉదయన్ చిల్డ్రన్స్ హోమ్లో గడిపాడు. స్వచ్ఛంద సంస్థలపై అమితాసక్తిని చూపే స్టీవ్ ఉదయన్ చిల్డ్రన్స్ హోమ్లో ఎక్కువ సేపు గడిపాడు. వారి ఆలనా పాలనాను తెలుసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాలో అరుదైన వ్యాధులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా అతను తనపేరిట స్టీవ్ వా ఫౌండేషన్ను కూడా నడుపుతున్నాడు.
టెస్ట్ చరిత్రలోనే ఓ మైలురాయి..
ఈడెన్ మైదానం వేదికగా 2001లో స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మ్యాచ్ టెస్ట్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన ఆలౌటైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా ఫాలో ఆన్ అడింది. రెండో ఇన్నింగ్స్లో లక్ష్మణ్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులు చేశారు. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లు కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్పై భారత స్పిన్నర్లు విజృంభించడంతో భారత్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.