ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. ముందుగా బ్యాటింగ్లో భారీ స్కోర్ నమోదు చేసిన టీమిండియా.. బౌలింగ్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. మూడో రోజు ఆట ఆరభంలోనే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ వరుస బంతుల్లో జో రూట్(22), బెన్ స్టోక్స్(0) పెవిలియన్ చేరారు. 77/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఆట ప్రారంభమైన రెండో ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్.. భారత్కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని సిరాజ్ లెగ్ సైడ్ వేయగా.. జోరూట్ ఆ దిశగానే ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోగా.. రిషభ్ పంత్ సూపర్ డైవ్తో అందుకున్నాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ మరుసటి బంతిని సిరాజ్.. బౌన్సర్గా సంధించగా.. స్టోక్స్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ పంత్ చేతిలో పడింది. దాంతో స్టోక్స్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్తో కలిసి హ్యారీ బ్రూక్ ఆచితూచి ఆడుతున్నాడు. 73 బంతుల్లో హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో స్మిత్ అతనికి చక్కగా సహకరిస్తున్నాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తెలంగాణ డీఎస్పీనా మజాకా అంటూ కామెంట్ చేస్తున్నారు. సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269) రికార్డ్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 89), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. వాషింగ్టన్ సుందర్(103 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(3/167) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/81), జోష్ టంగ్(2/119) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీసారు.