
న్యూఢిల్లీ: శ్రీలంకతో రెండో టీ20లో కెప్టెన్గా హార్దిక్ పాండ్యా చేసిన ఘోర తప్పిదం భారత ఓటమిని శాసించిందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. బౌలర్లను రొటేట్ చేయడంలో హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడని తెలిపాడు. డెత్ ఓవర్లలో అంతగా అనుభవం లేని శివమ్ మావికి బౌలింగ్ ఇవ్వడం జట్టుకు నష్టం చేసిందని చెప్పాడు. గురువారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. బౌలర్లు వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
టీమిండియా పరాజయం స్పందించిన జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డెత్ ఓవర్ బౌలింగ్లో అంతగా అనుభవం లేని శివం మావికి ఆ బాధ్యత అప్పగించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. మావికి బదులు హార్దింక్ పాండ్యా బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. 'డెత్ ఓవర్లలో శివమ్ మావికి బదులుగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడని అనుకున్నా. ఆరో ఓవర్ తర్వాత పాండ్యా బౌలింగ్కి వస్తాడని భావించా.
మిడిల్ ఓవర్లో ఒకటి రెండు ఓవర్లు వేసి ఆ తర్వాత డెత్ ఓవర్లలో బౌలింగ్కు దిగుతాడని ఊహించాను. ఎందుకంటే మిడిల్, డెత్ ఓవర్లలో హార్దిక్కు ఉన్నంత అనుభవం శివమ్ మావికి లేదు. అదే విధంగా అర్ష్దీప్ సింగ్కు రెండే ఓవర్లు ఇవ్వడం పాండ్య తీసుకున్న తప్పుడు నిర్ణయాలలో ఒకటి. శివం మావి తొలి మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. అయినా అతనికి కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు.
రెండో ఓవర్ మావికి ఇచ్చి అర్ష్దీప్ను మూడు, నాలుగు ఓవర్లలో బరిలోకి దించితే బాగుండేది. అర్ష్దీప్ చేసిన పని ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అతనికి బదులుగా పాండ్య మావిపై విశ్వాసం ఉంచి ఉంటే ప్రయోజనం ఉండేది'' అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో 5 నోబాల్స్ వేసిన కారణంగా టీ20 ఫార్మాట్లో అత్యధిక నో బాల్స్ వేసిన ఆటగాడిగా అర్ష్దీప్ చెత్త రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే.